దానవులపాడు

వికీపీడియా నుండి

కడప నుంచి జమ్మలమడుగు మార్గంలో 20 కి.మీ. దూరంలో పెన్నా నదీ తీరాన దానవులపాడులో జైనుల ఆలయం ఉంది. 2.75 ఎకరాల స్థలంలో ఈ జైనుల ఆలయం విస్తరించి ఉంది. ఈ ఆలయానికి పటిష్టమైన ప్రాకారం ఉంది. ప్రాకారం 15 అడుగుల ఎత్తు ఉంది. ఈ ప్రాకారానికి ఉపయోగించిన రాళ్ళు తెల్లనివి, బరువైనవి. పెన్న వరద తాకిడికి తట్టుకోవడానికి ఈ ప్రాకారం నిర్మించినట్లుంది. ఈ జైనాలయంలో కొలువైన దేవుడు పార్శ్వనాథుడు. ఈ విగ్రహం దిగంబరంగా ఉంటుంది. 12 అడుగుల ఎత్తుంటుంది. ఈ ఆలయానికి ప్రక్కనే మరో ఆలయ నిర్మాణముంది. నిర్మాణం మధ్యలో ఆగినట్లు అసంపూర్తిగా కనిపిస్తుంది. ఈ నిర్మాణం ఇసుక తిన్నెల్లో పూడిపోయి ఉంది. ఆలయం నుంచి పెన్నలోకి దిగేందుకు రాతి సోపానం 18 మెట్లతో నిర్మించారు. ఈ సోపానానికి ఇరువైపులా శిల్పాలున్నాయి. బూరుగు చెట్టు కింద నాగకన్యలు, చెట్టెక్కుతున్న కోతి, పాము పడగలు, ఏనుగులు, గణపతి శిల్పాలు చూడవచ్చు. జైనుల శాసనాల్లో దానవులపాడును 'కరిమారి' అని పేర్కొన్నారు. ఇక్కడ 1903లో తవ్వకాలు జరిపారు. ఇక్కడ లభించిన విగ్రహాలను చెన్నైలోని సంగ్రహాలయంలో భద్రపరిచారు.

క్రీ.శ. 7వ శతాబ్దం నాటి కన్నడ శాసనం (క్రీ.శ. 696-733) బయల్పడింది. 10 వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూటుల్లోని మూడవ ఇంద్రుని కాలం నాటికి దానవుల పాడు ప్రసిద్ధ జైన స్థావరంగా ఉండేది. విడి ప్రతిమలు తయారు చేసే కర్మాగారం కూడా ఇక్కడ ఉండినట్లు తెలుస్తున్నది. మూడవ ఇంద్రుడు 16వ తీర్థంకరుడగు శాంతి నాథుని స్నపనవిధి కోసం స్నాన పీఠాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. జైనులు మోక్షం కోసం కఠోర నియమం పాటించేవారు. ఉపవాస దీక్షతో క్రమంగా శరీరాన్ని కృశింపజేసి మృతి చెందే వారు. ఈ విధంగా మృతి చెందిన వారి బూడిద ఇక్కడ విస్తారంగా తువ్వమట్టి రూపంలో కనిపిస్తున్నది. ఆ కారణంగానే ఈ జైన కేంద్రానికి దానవులపాడు అని పేరు వచ్చినట్లు భావిస్తున్నారు.

దానవులపాడు, కడప జిల్లా, జమ్మలమడుగు మండలానికి చెందిన గ్రామము

ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి.