కట్టమూరు (పెద్దాపురం మండలం)

వికీపీడియా నుండి

కట్టమూరు, తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము మండల కేంద్రం పెద్దాపురమునకు 4 కిలోమీటర్ల దూరములో వుంది. ఈ వూరికి దగ్గరగా జే.తిమ్మాపురం, కాండ్రకోట, సిరివాడ గ్రామములు కలవు. ఈ గ్రామ ప్రజలు చాలా వరకు వ్యవసాయం మీద అధారపడి జీవించుచున్నారు. వరి, చెఱకు ముఖ్యమైన పంటలు. ఇక్కడి మెట్ట ప్రాంతంలో దుంప పండించెదరు. ఈ గ్రామము చాలా పురాతనమైన, పేరెన్నికగన్న గ్రామము. ఈ గ్రామము గురించి కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన "రాజశేఖర చరిత్ర" లో కూడా ప్రశ్తావించబడినది. ఈ గ్రామము నుంచి చాలా మంది చదువులకు, ఉద్యోగములకు విదేశములకు వెళ్ళియుండిరి.

ఇక్కడ ప్రఖ్యాతమైన పట్టాభిరాములవారి గుడి మరియు కేశవ స్వాములవారి గుడి కలదు. ఈ రెండు గుడులు ఒకే ఆవరణలో ఉండటం వల్ల అక్కద ప్రజలు ఈ గుడిని "జోడుగుళ్ళు" అని పిలిచెదరు. ఒక గుడిలో పట్టాభిరామ స్వామి వారు సీతాదేవి, లక్షణుడు, ఆంజనేయులుతో కొలువుతీరి ఉందురు. మరియొక గుడిలో కేశవ స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉందురు. ఇక్కడ ప్రతీ యేటా ఫిబ్రవరిలో వచ్చే భీష్మ ఏకాదశి నాడు పండుగ జరుపుదురు. ఇంకా ఈ ఊరిలొ శివాలయము, వినాయకుని గుడి, షిరిడి సాయిబాబావారి దేవాలయము, వీరబ్రహ్మం గారి ఆలయము, ఊరి మొదట్లో కనకదుర్గ గుడి, ఊరి చివరన పోలేరమ్మ తల్లి ఆలయము, ఇంకా చాలా శ్రీరాముని కోవెలలు, ఆంజనేయుని గుడులు కలవు.

ఈ గ్రామమునకు ముఖ్యమైన జల వనరు ఏలేరు కాలువ. ఈ కాలువ ఏలేశ్వరం దగ్గిర మొదలై, ఈ గ్రామము మీదుగా వెళుతూ చివరకు కాకినాడ దగ్గిర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంకా ఇక్కడ రాయన చెరువు, బాపనవీధి చెరువు, కిట్టా చెరువులు కూదా వున్నాయి. ఈ చెరువుల నీటిని పశువుల త్రాగునీటి కొరకు మరియు పంటపొలాల కొరకు ఉపయోగించెదరు. ఇదే కాకుండా మనుష్యుల త్రాగునీటి కొరకు మంచినీళ్ళ చెరువు కూడా కలదు.

సొసైటీ అధ్యక్షుడు : బిక్కిన శ్రీరాంప్రసాద్

గ్రామ పంచాయతీ అధ్యక్షుడు : ముండ్రు శ్రీనివాసరావు

ఏలేరు నీటి సంఘం అధ్యక్షుడు : కాకర్ల రాఘవరావు చౌధరి