జన జీవనం

వికీపీడియా నుండి

విషయ సూచిక

[మార్చు] ముగ్గులు

తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు.

వేపపువ్వు, చెరుకుముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంత శ్రద్ధతో తయారు చేస్తోందో చిట్టితల్లి ! వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పని చేయకూడదు.

[మార్చు] కొమ్మునృత్యం

కొమ్మునృత్యం గోదావరి తీర ప్రాంతాలలో నివసించే గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఈ నృత్యం ప్రదర్శించే కోయలు వారి భాషలో ఈ నృత్యాన్ని ' పెరియకోక్ ఆట ' అని అని అంటారు. కోయ భాషలో పెరియకోక్ అంటే దున్నపోతు కొమ్ములు అని అర్థం. దున్నపోతు కొమ్ములు ధరించి, దున్నలు కుమ్ముకునే రీతిలో నృత్యం చేస్తారు కాబట్టి ఈ నృత్యం ' కొమ్ము నృత్యం ' గా వ్యవహరింపబడుతున్నది. వీరు ఉపయోగించే వాద్యం " డోలు కొయ్య ", చైత్రమాసం లో భూదేవి పండుగను ఘనంగా చేసుకుంటారు కోయలు. ఆ పండుగ సమయంలో పురుషులు అడవులలోకి వేటకి వెళ్ళడం పరిపాటి. వేట ముగించుకుని విజయవంతంగా ఇంటికి చేరుకున్న సందర్భంగా కోయలు దున్నపోతు కొమ్మలు, నెమలి ఈకల గుత్తిని పొదిగిన బుట్టను తలకు అలంకరించుకుని రంగు రంగుల బట్టలు వేసుకుని ఆయా సంప్రదాయ వాద్యాల్ని వాయిస్తూ చేసే నృత్యం ఈ కొమ్ము నృత్యం.

[మార్చు] జముకు

పూర్వపు రోజులలో శక్తి గ్రామ దేవతల కొలుపులు చేసేటప్పుడు బవనీలు అనబడేవారు అతి బీభత్సంగా ' జముకు ' అనే వాద్యాన్ని గుండెలదిరేలా మ్రోగించేవారు. కల్లు, సారాయి లాంటి మత్తు పదార్థాల్ని సేవించి కణకణలాడే కళ్ళతో శక్తి ముందు చిందులు తొక్కుతూ గొర్రెలను, మేకలను గావు పట్టేవారు. గావు పట్టడం అంటే బలి పశువును నోటితో మెడకొరికి చంపడం అని అర్థం. ఆ పైన నెత్తురు గ్రోలి, దాని ప్రేగులు ధరించి, దొబ్బలు నోటకరిచి, జముకులను వాయిస్తూ వీధుల వెంట తిరిగేవారు. ఇప్పుడూ ఆ సంప్రదాయం పోయింది. కాలక్రమేణా ఈ వాద్యం ఆధారంగా కాటం రాజు మొదలైన కథా గీతికల్ని ఆలపించడం, ఆ కథలు జముకుల కథలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది.


[మార్చు] బొమ్మలకొలువు

ఏడాది పొడుగునా అల్మారాలలో దాగిన రంగురంగుల దేవతల బొమ్మలు, జంతువుల బొమ్మలు, దొరబొమ్మలు, దేశభక్తుల బొమ్మలు కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి కి, మరి కొన్నిచోట్ల దసరా కి ప్రత్యక్షమై ధూప దీపనైవేద్యాలు అందుకుంటూ కొలువు తీరుతాయి.

[మార్చు] ప్రభలు

మరొక తెలుగు సంప్రదాయం ప్రభలు. ఎంత ఎత్తు ప్రభ అయితే అంత గొప్ప. కోటప్పకొండ తిరణాలకి వందలాది రంగు రంగుల ప్రభలు శోభ చేకూర్చుతాయి.

గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని కోటప్పకొండ ప్రసిద్ధమైన శైవక్షేత్రం. మహాశివరాత్రి కి చాలా పెద్ద ఎత్తున తిరునాళ్లు జరుగుతాయి. లక్షలాది భక్తులు ఆనాడు అక్కడ ఉత్సవాలకు హాజరవుతారు. ముఖ్యంగా చూడవలసింది ప్రభల ప్రదర్శన. వందలాదిగా ప్రభలు ఆ ఉత్సవాలలో పాల్గొంటాయి. అవికాక ఇంకా కోలాటం, వీరంగం, హరికథ లు మొదలైనవి ఉంటాయి. తల నీలాలు మొక్కుబడులకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి. శివరాత్రికి రుద్రాభిషేకం, సహస్రనామార్చనలు జరుగుతాయి. ఇక్కడి శివుడిని కోటీశ్వరుడు అంటారు. ఆ పేరే తెలుగులో కోటప్ప అయింది.


[మార్చు] బుర్ర కథ

ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళా రూపం బుర్ర కథ. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. అది సంగీతం, నృత్యం, నాటకం. ఈ మూడింటి మేలుకలయిక. బుర్రకథలో నవరసాలూ పలుకుతాయి. ముఖ్యంగా వీర, కరుణరసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథల ; ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. బుర్రకథ అనగానే ' నాజర్ ' గారి పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు. బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం. బొబ్బిలియుద్ధం బహుళ ప్రచారం పొందినవి.

బుర్రకథ ప్రాచీనమైన తెలుగు జానపద కళ. అయితే అది నిలుచుని చిందులు వేస్తూనే చెప్పనక్కర లేదు. కూర్చుని కూడా బుర్రకథ చెప్పి శ్రోతలను రంజింపజేయవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపాన దొడ్డిపాట్ల గ్రామంలో కూర్చుని బుర్రకథ చెప్పే బృందాన్ని ఫోటో లో చూడవచ్చు.


[మార్చు] తండాలనృత్యం

లంబాడీలు, సుగాలీలు, బంజారాలు అని వివిధ నామాలతో పిలువబడే ఆదిమ జాతివారు నాగరిక సమాజానికి దగ్గరగా పల్లెలలో, పట్టణాలలో నివసిస్తున్నా తమ కట్టు, బొట్టు, మాట, పాట, ఆట, ఆచార వ్యవహారాలను సంస్కృతిని వందలాది ఏళ్ళుగా నిలుపుకుంటూ వస్తున్నారు. వీరు తండాలుగా జీవిస్తారు. వీరి సామూహిక నృత్యం నేత్రపర్వంగా ఉంటుంది.

[మార్చు] యక్షగానం

యక్షగాన పరిణామ చరిత్ర అతి విచిత్రమైనది. రచనలో, ప్రదర్శనలో, తరతరాలకు మార్పుచెందుతూ వచ్చినది. మొదట యాత్రా స్థలాలు, కామందులు లోగిళ్ళు తదుపరి పల్లెపట్టుల రచ్చసావిడి, రాచదేవిడీలు యక్షగాన ప్రదర్శనల కథిస్థానములైనవి. వర్తమానమున అప్పటికప్పుడు ఏ వూరి మొగనో, యే కోవెల వాకిటనో, యే సంపన్న గృహస్థు ఇంటి ముందటనో, తాటాతూటముగా నిర్మింపబడిన కమ్మల పందిరి కింద, కళ్ళాపుజల్లిన కటికనేలయే దాని రంగస్థలము.

పగటివేష కళాకారులకు రంగస్థలంతో పనిలేదు. పాత్రోచితము. రసోచితము, ప్రాంతీయోచితమైన వేష భాషలతో, నృత్య గానాలతో పట్టపగలు వేషాలు వేసుకుని హావ భావ నటనలు చిలికిస్తూ, రాగమేళ తాళాలతో, పండిత పామరులను మెప్పించడం పగటివేష కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. వీరు ఊరూరా తిరుగుతూ ప్రదర్శించే ఈ రకాలైన ప్రక్రియలలో యక్షగానం ఒకటి.


[మార్చు] తప్పెటగుళ్ళు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో యాదవ కులానికి చెందినవారు చేసే నృత్యాన్ని తప్పెటగుళ్ళు అంటారు. ఎదురు రొమ్ముపై ధరించిన రేకు తప్పెటలను వాయిస్తూ వీరు ముఖ్యంగా శ్రీకృష్ణగాథలను గానం చేస్తారు.

డెల్టా జిల్లాలకు కాల్వలే అందం. పొలాలకు జలాల నివ్వడమేకాక సరకుల రవాణాకు కూడా ఎంతో ఉపయోగం.

[మార్చు] జంగందేవరలు

తలపైన ఫణిచక్రం కలిగిన కిరీటం, నుదుట విభూతి రేఖలు, చంకలో జోలె, ఒక చేతిలో ఇత్తడి గంట, మరో చేతిలో కర్ర జంగం దేవర ఆహార్యం ; ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో బుడబుక్కలవాడు అర్థరాత్రి వచ్చి బుడబుక్కని వాయిస్తూ వెళ్ళగానే వేకువ ఝామున శంఖం ఊదుతూ, గంటను మ్రోగిస్తూ - శివుని కీర్తిస్తూ జంగం దేవర ఊరంతా కలియతిరుగుతూ, ప్రతి ఇంటి ముందు ఆగి గృహస్థులను దీవిస్తూ ముందుకు కదులుతాడు.


[మార్చు] ఎడ్లపందాలు

తెలుగు పల్లెలలో ఎడ్ల బలాబలాలను పరీక్షించే బండ లాగుడు పందాలు సర్వ సామాన్యం. రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కు కూడా ఈ పందాలు మహా ఇష్టం.


[మార్చు] కోడి పందాలు

ఇప్పుడు జంతు హింసగా వీటిని నిషేధించారుగాని, ఒకప్పుడు సంక్రాంతి కి ఊరూరా కోడి పందాలు తప్పనిసరిగా జరిగేవి. పల్నాటి యుద్ధానికి ఒక కారణం కోడి పందెమే.


[మార్చు] పులివేషం

సర్కారు జిల్లాలలో దసరా పండుగకు, తెలంగాణాలో పీర్ల పండుగకు పులి వేషం కడతారు డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, పులి ఇతర జంతువులను ఎలా ఒడుపుగా వేటాడుతుందో చక్కగా ప్రదర్శిస్తారు ఈ కళాకారులు. ఈ వేషం వేయడంలో విజయవాడకు చెందిన శ్రీ గర్రె అప్పారావు, విజయనగరానికి చెందిన శ్రీ పైడి గురువులు సిద్ధహస్తులు.

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విజయదశమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజున కృష్ణానది లో తెప్పోత్సవం జరుగుతుంది. హంస ఆకారంలో తెప్పను రమణీయంగా అలంకరిస్తారు. దానిలో అమ్మవారిని వుంచి నదిలో ఊరేగిస్తారు. ఒడ్డును చేరిన వేలాది భక్తులకు అది కన్నుల పండుగ.


[మార్చు] హరిదాసులు

ఒకచేత చిడతలు, మరొకచేత తంబురా మీటుతూ, ఇంటింటి ముంగిట ఆగి " ఏ తీరుగ నను దయ చూచెదవో. . . . . . " అంటూ ఏదో కీర్తన పాడుతూ హరిలో రంగహరి అని కదిలే హరిదాసులు ధనుర్మాస రాయబారులు.


[మార్చు] గోరింటాకు

కాళ్లకు పారాణి ఎలాగో చేతులకు గోరింటాకు అలాగ. గోరింటాకు శోభముందు నేటి గోళ్ల రంగులు దిగదుడుపే.


[మార్చు] గుసాడీ

ఆదిలాబాదు జిల్లాలో రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ. పౌర్ణమి నాడు ప్రారంభించి నరకచతుర్థశి వరకు గోండులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. నెమలి పింఛాలతో తయారు చేసిన పాగా, కృత్రిమమైన గడ్డాలు, మీసాలతో వేషం కట్టి, మెడలో గవ్వల హారాలు, తుంగకాయల దండలు, నడుముకు, మణికట్టుకు చిరు గంటలు, గజ్జెలు ధరించి, కంటి చుట్టూ తెల్లని రంగు పూసుకుని, చేతిలో కర్ర పట్టుకుని గుసాడీ నాట్యం చేస్తారు.


[మార్చు] థింసా

థింసా నృత్యం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో విశేషాదరణ పొందిన జానపద సామూహిక నృత్యాలలో ఒకటి. ఇది గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఆడా, మగా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని కొండ జాతులవారు ఈ జానపద నాట్య సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ నాట్యాన్ని ప్రతి పండుగ సందర్భంలోనూ, వివాహాది సందర్భాలలోనూ చేస్తుంటారు. వీరి దైనందిన జీవితానికి, ఆచార వ్యవహారాలకు ఈ నాట్యం అద్దం పడుతుంది.


[మార్చు] డప్పు

పల్లెల్లో ప్రముఖమైన ప్రచార సాధనం డప్పు. అది ఏ ఉత్సవానికైనా పల్లెల్లో విశేషంగా ఉపయోగపడే వాద్యం. ఉద్రేకాన్ని, ఉత్తేజాన్ని కలిగించే డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ చేసే నృత్యం డప్పు నృత్యం. ఈ నృత్యం ముందు మెల్లగా ప్రారంభమై రాను రాను పదవిన్యాసంతో పాటు వాద్యం కూడా ఉధృతమై, ఉత్తేజం కలిగిస్తుంది. ఆంధ్రదేశంలోని అన్ని పల్లె ప్రాంతాలలోను డప్పు ఉనికి మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది.

[మార్చు] శరభనృత్యం

శరభ శరభా, దశ్శరభ శరభా అని వీరంగం వేస్తూ, చిందులు తొక్కుతూ, పొడవాటి పలుపు తాడుతో వీపులపై తాటించుకుంటూ నృత్యం చేయడం ఒక జానపద కళ. ఈ సంప్రదాయానికి చెందిన కళాకారులు తమ విద్యను ప్రదర్శిస్తున్న దృశ్యాన్ని పైఫోటోలో చూడవచ్చు.


[మార్చు] చెమ్మచెక్క

చెమ్మచెక్క - చేరడేసి మొగ్గ. . . . అంటూ ఆడే ఇలాంటి పడుచు పిల్లల్ని చూసే కవి తిలక్ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని ఉంటాడు.


[మార్చు] రుంజ

రుంజ అనే ఈ చర్మ వాద్యం అతి ప్రాచీనమైనది. శైవ సంప్రదాయానికి చెందినది. ఇప్పుడు సర్కారుజిల్లాలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఈ రుంజ వాద్యాన్ని విశ్వ బ్రాహ్మణులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. తరం నుంచి తరానికి ఈ వాద్యకళ కొనసాగుతూ వస్తున్నది. 32 రకాలుగా దీన్ని వాయించవచ్చునట.

[మార్చు] గంగిరెద్దులు

 డు డు బసవన్న - గంగిరెద్దు
పెద్దది చెయ్యి
డు డు బసవన్న - గంగిరెద్దు

ధనుర్మాసం వస్తూనే తెలుగునాట గంగిరెద్దులు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఆడించడంలో ఎన్నో వింత పోకడలున్నాయి.

[మార్చు] చెడుగుడు

ఉత్తరాదివారు కబడ్డీ అంటారు. తెలుగు వారు చెడుగుడు అంటారు. ఏ పేరుతో ఆడినా అందరికీ ఆసక్తి కలిగిస్తుంది ఈ ఆట.

[మార్చు] బతకమ్మ

తెలంగాణా ప్రాంతంలో ఆచరించే పూల పండుగ, పూబోడుల పండుగ -- ' బతకమ్మ '. తొమ్మిది రోజులపాటు ఎంతో ఉత్సాహంతో మహిళలు జరిపే ఈ పండుగ చివరి రోజును ' సద్దలు ' అని వ్యవహరిస్తారు. దసరా కు ఒక రోజో, రెండు రోజులో ముందుగా ఈ పండుగ వస్తుంది. రంగు రంగుల పూలను ఎంతో మెళుకువతో పిరమిడ్ ఆకారంలో పేర్చి, ఆ పువ్వుల కుచ్చెన నడిబొడ్డులోగాని, శిఖరంలోగాని గౌరమ్మను అమరుస్తారు. ఈ పువ్వుల పళ్లెరాన్ని వాకిట్లో ఉంచి కొత్త దుస్తులు ధరించి స్త్రీలు, బాలికలు చేరి దీని చుట్టూ క్రమంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. తర్వాత ఊరేగించి ఈ బతకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు.

సస్యశ్యామలాం మాతరం అన్నాడు బంకించంద్రుడు. ఏపుగా పెరిగిన వరి చేలలో కోతలు చూడచక్కని దృశ్యం.

ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించి ఉన్న షెడ్యూలు తెగ ప్రజలు లంబాడీలు, లేదా బంజారాలు. ఆధునిక నాగరికత దేశాన్ని ఎంతగా వశపరచుకున్నా ఈ తెగవారు మాత్రం తమ శతాబ్దాల వేషభాషలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా లంబాడీ మహిళల రంగురంగుల దుస్తులు, రకరకాల ఆభరణాలు చూడముచ్చటగా ఉంటాయి.

గొర్రెల మందలను కాయడం ఒక వర్గం ప్రజలకు వృత్తి. గొర్రెలు పాలు ఇస్తాయి, ఉన్ని ఇస్తాయి. పైగా వ్యవసాయ భూములలో మందలను వదలి పెట్టడం వల్ల ఆ భూములకు ఎరువులు సమకూరి సారం పెరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కాపరులు గొర్రెలను తోలుకుపోవడం తెలుగునాట తరుచుగా కనబడే చక్కని దృశ్యాలలో ఒకటి.

[మార్చు] మొహరం పండుగ :

మృతవీరులు - హసన్, హుస్సేన్ సంస్మరణార్థం మొహరం మాసంలో పది రోజులు జరిపే పండుగ మొహరం. ఏభై సంవత్సరాల క్రితం నగరంలో మొహరం ఊరేగింపు చూడడం ఒక గొప్ప అనుభవం. నానాటికి ఈ విషాద గర్భిత ఉత్సవం ఆచరించుకునే తీరులో మార్పులు వస్తున్నట్టు గమనించవచ్చు. ఈ పండుగనే పీర్ల పండుగ గా తెలుగులో వ్యవహరిస్తారు. ఈ పండుగ సందర్భంగా సున్నీ తెగవారు ఆకుపచ్చ దుస్తులు, షియా తెగవారు నల్లని వస్త్రాలను ధరిస్తారు. స్త్రీలు సంతాప సూచకంగా ఆభరణాలు ధరించరు. తల వెంట్రుకలు కూడా ముడవరు. చేతి గాజులు తొలగిస్తారు.

హిందువుల పండుగలలో అతి ముఖ్యమైనది వినాయక చవితి. దీన్ని ఔత్తరాహులు గణేశ్ చతుర్థి అంటారు. తలపెట్టిన పనులు విఘ్నరహితంగా నెరవేరాలని కోరుతూ వినాయకుడిని ఆనాడు పూజిస్తారు. అన్ని రకాల పత్రి, పువ్వులు, ఫలాలు, పూజాద్రవ్యాలు, వినాయకునికి ఇష్టమైన కుడుములు ఆనాటి పిండి వంటలలో ముఖ్యభాగం. పూజానంతరం వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిపై చల్లుకుంటే తప్ప పండుగ పూర్తికాదు. పూజ చెయ్యకుండా ఆ రాత్రి చవితి చంద్రుడిని చూడరాదని కట్టడి.

పూర్వం మన పల్లెటూళ్ళలో ఏ ఉత్సవం జరిగినా, తిరునాళ్ళు జరిగినా బుట్ట బొమ్మలు ప్రత్యక్షమయ్యేవి. ఈ బుట్టబొమ్మలు ధరించిన కళాకారులు వాద్యాలకు అనుగుణంగా లయాన్వితంగా నాట్యం చేస్తారు. క్రమంగా ఈ కళ అంతరించి పోతున్నది.

కాళ్లకు పారాణి అచ్చమైన తెలుగు సంప్రదాయం. కాళ్లకు పారాణి పూసుకుని పావడా కుచ్చెళ్లు ఎత్తిపట్టుకుని వెండి పట్టాలు ఘల్లు ఘల్లుమంటూండగా కన్నెపిల్లలు నట్టింట నడయాడడం కంటె అందమైన దృశ్యం ఉండదు.


[మార్చు] మూలాలు, వనరులు