కె.ఎల్.రావు
వికీపీడియా నుండి
డా. కానూరి లక్ష్మణరావు (1902,జూన్ 6 - 1986,మే 18) ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. పదవీ విరమణ చేసాక కేంద్రములో నెహ్రూ మంత్రివర్గములో నీటిపారుదల శాఖా మంత్రిగా కూడా పనిచేసాడు. 1972 లో గంగా కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించినది ఈయనే.
లక్ష్మణరావు 1902,జూన్ 6 న కృష్ణా జిల్లా విజయవాడ సమీపమున ఉన్న కంకిపాడు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి గ్రామ కరణము. బాల్యము నుండే ఈయన ప్రతిభావంతమైన విధ్యార్ధిగా పేరు తెచ్చుకొన్నాడు.
మద్రాసు విశ్వవిద్యాలయము లో ఇంజనీరింగు (బీ.ఈ) డిగ్రీ పూర్తి చేసి. ఇంజనీరింగులో పోస్టుగ్రాడ్యుయేట్ చేశాడు. ఇంజనీరింగులో మాస్టరు డిగ్రీ పొందిన తొలి వ్యక్తి ఈయనే. కొన్ని రోజులు రంగూన్ లో ప్రొఫెసర్ గా పనిచేసి ఆ తరువాత ఇంగ్లండు లోని బర్మింగ్హాం యూనివర్శిటీ నుండి డాక్టరేట్ ను పొందాడు. ఈయన ఇంగ్లండులో అసిస్టెంటు ప్రొఫెసరుగా పనిచేశాడు. ఆ కాలములో స్ట్రక్చరల్ ఇంజనీరింగు మరియు రీఇంఫోర్స్డ్ కాంక్రీటు అను పుస్తకము రచించాడు.
1946 లో భారత దేశము తిరిగివచ్చి మద్రాసు ప్రభుత్వములో డిజైన్ ఇంజనీరుగా పనిచేశాడు. 1950 లో డిల్లీలో విద్యుత్ కమీషనులో డైరెక్టరు (డిజైన్స్) పదవిని నిర్వహించాడు. 1954 లో చీఫ్ ఇంజనీరు గా ఉన్నతి పొందాడు. ఈయన కేంద్ర వేర్హౌసింగ్ కార్పోరేషన్ లొ సభ్యుడు. 1957 లో పదవీ విరమణ పొందినా 1962 వరకు సభ్యునిగా కొనసాగాడు.
1962 నుండి 1977 వరకు మూడు పర్యాయములు విజయవాడ నియోజక వర్గము నుండి కాంగ్రేసు పార్టీ అభ్యర్ధిగా లోక్సభకు ఎన్నికైనాడు. ఈయన నెహ్రూ, లాల్బహుదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీల మంత్రివర్గములలో పది సంవత్సరాల పాటు కేంద్ర నీటిపారుదల మరియు విద్యుఛ్ఛక్తి శాఖా మంత్రిగా పనిచేశాడు. అనేక భారి ఆనకట్టల యొక్క రూపకల్పనలో ఈయన పాత్ర ఉన్నది. ఈయన కేంద్ర మంత్రిగా ఉన్న కాలములో అనేక జలవిద్యుఛ్ఛక్తి మరియు నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పన చేశాడు. ప్రపంచములోనే అతిపెద్ద మట్టితో కట్టిన ఆనకట్ట నాగార్జునసాగర్ ఈయన రూపకల్పన చేసినదే. మొదటి నాలుగు పంచవర్ష ప్రణాళికా కాలములలో ఈయన నాగార్జున సాగర్, దిగువ భవానీ, మాలంపూయ, కోసి, హీరాకుడ్, చంబల్, ఫరక్కా, శ్రీశైలం మరియు తుంగభద్ర ప్రాజెక్టు లకు రూపకల్పన చేశాడు.
ఈయన స్మృత్యర్ధము పులిచింతల ప్రాజెక్టు కు కె.ఎల్.రావు ప్రాజెక్టు అని నామకరణము చేయబడినది. ఒక ఇంజనీరు పేరును ప్రాజెక్టుకు పెట్టడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇదే ప్రథమము.