కర్నాటక
వికీపీడియా నుండి
కర్నాటక | |
రాజధాని - Coordinates |
బెంగుళూరు - |
పెద్ద నగరము | బెంగుళూరు |
జనాభా (2004) - జనసాంద్రత |
55,868,200 (9వది) - 290.98/చ.కి.మీ |
విస్తీర్ణము - జిల్లాలు |
192,000 చ.కి.మీ (8వది) - 27 |
సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1956-11-01 - టీ.ఎన్.చతుర్వేది - హెచ్.డీ.కుమారస్వామి - Bicameral (224 + 75) |
అధికార బాష (లు) | కన్నడ |
పొడిపదం (ISO) | IN-KA |
వెబ్సైటు: www.karnataka.gov.in | |
కర్నాటక రాజముద్ర |
కర్నాటక ( కన్నడ లో ಕರ್ನಾಟಕ) భారతదేశములోని నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. 1950 లో పూర్వపు మైసూరు రాజ్యము నుండి యేర్పడటము వలన 1973 వరకు ఈ రాష్ట్రము మైసూరు రాష్ట్రముగా వ్యవహరించబడినది. 1956 లో చుట్టుపక్క రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలుపుకొని విస్తరించబడినది. కర్నాటక రాజధాని బెంగుళూరు రాష్ట్రములో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఏకైక నగరము. మైసూరు, మంగుళూరు, హుబ్లి-ధార్వాడ్, బళ్లారి మరియు బెల్గాం రాష్ట్రములోని ఇతర ముఖ్య నగరాలు. కన్నడ, కర్నాటక రాష్ట్ర అధికార భాష. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశములో 5 కోట్లకు మించి జనాభా ఉన్న పది రాష్ట్రాలలో ఇది ఒకటి.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికము
కర్నాటకకు పశ్చిమాన అరేబియా సముద్రము, వాయువ్యమున గోవా రాష్ట్రము, ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున ఆంధ్ర ప్రదేశ్ , తూర్పున మరియు ఆగ్నేయమున తమిళనాడు మరియు నైౠతిన కేరళ రాష్ట్రములు సరిహద్దులుగా కలవు.
భౌగోళికముగా రాష్ట్రము మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించబడినది.
- సన్నని తీర ప్రాంతము, - పడమటి కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్యన ఉన్న ఈ ప్రాంతము లోతట్టు ప్రాంతము. ఇక్కడ ఓ మోస్తరు నుండి భారి వర్షాలు కురుస్తాయి.
- పడమటి కనుమలు - ఈ పర్వత శ్రేణులు సగటున 900 మీటర్ల ఎత్తుకు చేరతాయి. వర్షపాతము ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతము.
- దక్కన్ పీఠభూమి - కర్నాటకలోని చాలా మటుకు భూభాగము ఈ ప్రాంతములోనే ఉన్నది. ప్రాంతము పొడిగా వర్షాభావముతో సెం-అరిద్ స్థాయిలో ఉన్నది.
కర్నాటక యొక్క పేరు ఎలా వచ్చినది అనేదానికి చాలా వాదనలున్నాయి. అయితే అన్నిటికంటే తర్కబద్ధమైన వాదన ఏమిటంటే కర్నాటక పేరు కరు+నాడు = ఎత్తైన భూమి నుండి వచ్చినదని. గమనించవలసిన విషయమేమంటే కర్నాటక రాష్ట్ర సగటు ఎత్తు 1500 అడుగులు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువే.
రాష్ట్రములో అత్యధిక ఉష్ణోగ్రత 45.6 సెంటీగ్రేడు రాయచూరు వద్ద 1928 మే 23న నమోదైనది. అత్యల్ప ఉష్ణోగ్రత 2.8 డిగ్రీల సెంటీగ్రేడు బీదర్ లో 1918 డిసెంబర్ 16 న నమోదైనది. [1]
[మార్చు] జిల్లాలు
కర్నాటక జిల్లాలు చూడండి
[మార్చు] భాష
కర్నాటక, భాష ఆధారితముగా యేర్పడిన రాష్ట్రము. అందుకే రాష్ట్రము యొక్క ఉనికిలో ఇది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాష్ట్రములో అత్యధిక సంఖ్యాకులు అధికార బాష అయిన కన్నడను మాట్లాడతారు. తమిళము, కొడవ మరియు తులు ఇతర బాషలు.
[మార్చు] ఆర్ధిక రంగము
కర్నాటక భారతదేశములోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటి. దీని రాజధాని బెంగుళూరు దేశములో సమాచార సాంకేతిక సేవలకు ప్రధాన కేంద్రము. భారతదేశములోని 90% బంగారము ఉత్పాదన కర్నాటకలోనే జరుగుతుంది. ఇటీవల మాంగనీసు ముడిఖనిజము యొక్క వెలికితీత పనులు బళ్ళారి మరియు హోస్పేట జిల్లాలలో ముమ్మరముగా సాగుతున్నాయి.
[మార్చు] చరిత్ర
కర్నాటక చరిత్ర పురాణ కాలమునాటిది. రామాయణములో వాలి, సుగ్రీవుడు మరియు 'వానర సేన యొక్క రాజధాని ప్రస్తుత బళ్లారి జిల్లాలోని హంపి అని భావిస్తారు. మహాభారతములో పాండవులు తమ తల్లి కుంతితో వనవాసము చేయుచున్న కాలములో భీమునిచే చంపబడిన కౄర రాక్షసుడు అయిన హిడింబాసురుడు ప్రస్తుత చిత్రదుర్గ జిల్లా ప్రాంతములో నివసించుచుండేవాడు. అశోకుని కాలమునాటి శిలాశాసనములు ఇక్కడ లభించిన పురాతన పురావస్తు ఆధారాలు.
క్రీ.పూ. 4వ శతాబ్దములో శాతవాహనులు ఈ ప్రాంతమున అధికారమునకు వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించారు. ఈ వంశము క్షీణించడముతో ఉత్తరమున కాదంబులు, దక్షిణమున గాంగులు అధికారమునకు వచ్చారు. అత్యంత ఎత్తైన గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహము గాంగుల కాలమునాటి కట్టడమే. బాదామీ చాళుక్యులు (500 - 735) వరకు నర్మదా నదీ తీరమునుండి కావేరీ నది వరకు గల విస్తృత ప్రాంతాన్ని రెండవ పులకేశి కాలము (609 - 642)నుండి పరిపాలించారు. రెండవ పులకేశి కనౌజ్ కు చెందిన హర్షవర్ధనున్ని కూడా ఓడించాడు. బాదామీ చాళుక్యులు బాదామీ, ఐహోల్ మరియు పట్టడకళ్ లో అద్భుతమైన రాతి కట్టడాలను కట్టించారు. ఐహోల్ ను దేశములో ఆలయ శిల్పకళకు మాతృభూములలో ఒకటిగా భావిస్తారు. వీరి తరువాత 753 నుండి 973 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మల్ఖేడ్ కు చెందిన రాష్ట్రకూటులు కనౌజ్ పాలకులపై కప్పము విధించారు. ఈ కాలములో కన్నడ సాహిత్యము ఎంతగానో అభివృద్ధి చెందినది. ప్రముఖ జైన పండితులు ఎందరో వీరి ఆస్థానములో ఉండేవారు. 973 నుండి 1183 వరకు పరిపాలించిన కళ్యాణీ చాళుక్యులు మరియు వీరి సామంతులైన హళిబేడు హొయసలులు అనేక అద్భుతమైన దేవాలయాలను కట్టించి సాహిత్యము మొదలైన కళలను ప్రోత్సహించారు. మితాక్షర గ్రంధమును రచించిన ప్రముఖ న్యాయవేత్త విజ్ఞేశ్వర కళ్యాణీలోనే నివసించాడు. వీరశైవ మతగురువైన బసవేశ్వర కళ్యాణీలోనే మంత్రిగా ఉండేవాడు. విజయనగర సామ్రాజ్యము దేశీయ సాంప్రదాయాలకు పెద్దపీట వేసి కళలను, మతమును, సంస్కృత, కన్నడ, తెలుగు మరియు తమిళ భాషలలో సాహిత్యమును ప్రోత్సహించారు. ఇతర దేశాలతో వాణిజ్యము అభివృద్ధి చెందినది. గుల్బర్గా బహుమనీ సుల్తానులు మరియు బీజాపూరు ఆదిల్షాహీ సుల్తానులు ఇండో-సార్సెనిక్ శైలిలో అనేక కట్టడములు కట్టించినారు మరియు ఉర్దూ, పర్షియన్ సాహిత్యాలను ప్రోత్సహించారు. మరాఠాపీష్వా మరియు టిప్పూ సుల్తాన్ల పతనముతో మైసూరు రాజ్యము (కర్నాటక) బ్రిటీషు పాలనలోకి వచ్చినది.
భారత స్వాతంత్రానంతరము, మైసూరు ఒడియార్ మహారాజు తన రాజ్యాన్ని భారత దేశములో విలీనము చేశాడు. 1950 లో, మైసూరు రాష్ట్రముగా అవతరించడముతో, పూర్వపు మహారాజు కొత్తగా యేర్పడ్డ రాష్ట్రానికి రాజప్రముఖ్ లేదా గవర్నరుగా నియమితుడయ్యాడు. విలీనము తర్వాత ఒడియార్ కుటుంబానికి ప్రభుత్వము 1975 వరకు భత్యము ఇచ్చినది. ఈ కుటుంబ సభ్యులు ఇప్పటికీ మైసూరులోని తమ వంశపారంపర్యమైన ప్యలెస్ లోనే నివసిస్తున్నారు.
రాజ్యోత్సవ దినము (నవంబర్ 1, 1956) న కూర్గ్ రాజ్యాన్ని, చుట్టుపక్కల ఉన్న మద్రాసు, హైదరాబాదు మరియు బొంబాయి లలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని మైసూరు రాష్ట్రము విస్తరించి ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 1973 నవంబర్ 1 న రాష్ట్రము పేరు కర్నాటక అని మార్చబడింది.
[మార్చు] పకృతిసిద్ధ ప్రదేశాలు
కర్నాటక అనేక జాతీయ వనాలకు ఆలవాలము. అందులో ముఖ్యమైనవి
- బందీపూర్ జాతీయవనము - మైసూరు జిల్లా
- బన్నేరుఘట్ట జాతీయవనము - బెంగుళూరు జిల్లా
- నాగర్హోల్ జాతీయవనము - మైసూరు, కొడగు జిల్లాలు
- కుద్రేముఖ్ జాతీయవనము - దక్షిణ కన్నడ, చిక్మగులూరు జిల్లాలు
- ఆన్షీ జాతీయవనము - ఉత్తర కన్నడ జిల్లా.
ఇవే కాక అనేక వన్యప్రాణి సమ్రక్షణాలయాలు అభయారణ్యాలు ఉన్నాయి. షిమోగా జిల్లాలోని జోగ్ జలపాతము ప్రపంచములోనే రెండవ ఎత్తైన జలపాతము
[మార్చు] ఇవికూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
- హసన్లోని హొయసల పర్యటన
- కర్నాటక పటము
- కర్నాటక రాష్ట్ర పర్యాటక శాఖ
- కర్నాటక పర్యటన
- కర్నాటక రాష్ట్ర ప్రభుత్వము
- కర్నాటక ప్రభుత్వ సమాచార శాఖ
- కర్నాటక చరిత్ర మరియు సాంస్కృతిక అంశాలు
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | ![]() |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అస్సాం | బీహార్ | చత్తీస్గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ మరియు కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్, నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్, డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |