వినాయకుడు

వికీపీడియా నుండి

వినాయకుడు
పెద్దది చెయ్యి
వినాయకుడు
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే

తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను)


అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే

(అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.


ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముపవశ్రవస్తవం
జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతిః ఆన ష్రుణ్వన్నూతిభిః సీదసాదనం


వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్ధన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానం లో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు)


వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు , నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత గొడ్డలి, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రదము. హిందూ సంప్రదాయము తో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.


విషయ సూచిక

[మార్చు] వినాయకుని గూర్చి కధలు

[మార్చు] వినాయకుని జననం

వినాయకుని జననం గూర్చి సర్వసాధారణమైన కధ, వినాయక చవితి వ్రతంలో చదివేది: గజాననుడు అనే రాక్షసుడు శివభక్తుడు శివుని తన శరీరములో దాచుకొన్నాడు. కాని విష్ణువుకు ఇచ్చిన మాట ప్రకారం, తన శిరస్సును లోకపూజ్యము చేయమని కోరి, మరణించాడు. కైలాసములో శివుని రాకకు ఎదురు చూసే పార్వతి పిండితో ఒక బాలుని బొమ్మ చేసి, ప్రాణము పోసింది. తను స్నానమునకు పోవునపుడు ఆ బాలుని వాకిలివద్ద కావలి ఉంచింది. ఆ బాలుడు ద్వారముదగ్గర శివుని అడ్డుకొన్నాడు. కోపించి శివుడు బాలుని తల తెగవేశాడు. విషయము తెలిసికొని పార్వతి హతాశురాలైంది. ఆప్పుడు శివుడు గజాననుని శిరస్సును అమర్చి తన కొడుకుని తిరిగి బ్రతికించాడు. గణపతిగా నియమించాడు.


బ్రహ్మవైవర్తపురాణంలో కధ: శివుని ఉపదేశము ప్రకారము పార్వతి విష్ణువును పూజించి, పుణ్యక వ్రతమాచరించి కొడుకును కన్నది. ఆ బాలుని జన్మము వేడుకలలో బ్రహ్మాది దేవలంతా వచ్చి ఆశీర్వదించారు. కాని శనీశ్వరుడు మాత్రం ఆ బాలుని వైపు చూడలేదు, తన దృష్టి వల్ల హాని జరుగుతుందనే భయంతో. కాని పార్వతి బలవంతంపై బాలుని ముఖం చూడక తప్పలేదు. అప్పుడు ఆ బిడ్డ తల పగిలిపోయింది. దేవతలంతా చింతితులు కాగా విష్ణువు పుష్పభద్రానదీ తీరంనుంచి ఒక గున్న ఏనుగు తల తెచ్చి, అతికించి, ఆ బాలును పునరుజ్జీవితుని చేశాడు.

[మార్చు] గణాధిపత్యం, చంద్రునినవ్వు, పార్వతిశాపం

గణాధిపతి స్థానానికి వినాయకుడూ, కుమారస్వామీ పోటీ పడ్డారు. శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు- "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చెసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుంది". కుమార స్వామి నెమలి వాహనంపై వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. వినాయకుడు నారాయణ మంత్రము జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. నారములు అనగా జలములు, జలమున్నియు నారాయుణుని ఆధీనాలు. అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందె వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యము లభించినది.


గణాధిపతియైన వినాయకుడు లోకములపూజలు అందుకొని, సుష్టుగా భోజనం చేసి, కైలాసమునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోయాడు. కాని బొజ్జ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే, అదిచూసి చంద్రుడు పకపక నవ్వాడు. ఆ నవ్వుకు (దృష్టి దోషానికి) వినాయకుడి పొట్ట పగిలిపోయింది. కోపించిన పార్వతి "నిన్ను చూచినవారు నీలాపనిందలకు గురియగుదురు గాక" అని శపించినది. ఫలితముగా లోకమునకు చంద్రుడు నింద్యుడయినాదు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శపమైనది. లోకులు చంద్రుని చూడకుండటెట్లు? నీలాపనించల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు.


లోకుల ప్రార్ధనలు మన్నించిన పార్వతి 'భాద్రపద శుద్ధ చవితి' నాడు (చంద్రుడు నవ్విన నాడు) మాత్రమే ఈ శాపము వర్తిస్తుందని శాప ప్రభావాన్ని సడలించింది. ఆ ఒక్కరోజు లోకులు జాగ్రత్త పడసాగారు. ద్వాపర యుగంలో కృష్ణుడుపొరపాటున చంద్రుని చూచినందున ఆయనకు కూడా శ్యమంతకమణి అపహరించాడనే అపనింద అంటుకుంది. శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని ఋజువు చేసుకొన్నాడు. కాని శక్తి హీనులైన సామాన్యులకు ఇది ఎలా సాధ్యం? ప్రజల విన్నపాన్ని మన్నించి కృష్ణుడు "భాద్రపద శుద్ధ చవితి" నాడు వినాయకుని పూజించి, ఈ కధ విని, అక్షతలు తలపై ధరిస్తే ఈ శాపదోషం అంటదని ఉపాయాన్ని అనుగ్రహించాడు


(ఈ కధ వినాయక వ్రత కల్ప విధానము వ్యాసంలో వివరంగా ఇవ్వబడినది)


[మార్చు] సిద్ధి, బుద్ధి

వినాయకునకు సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలు. కనుకనే వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలూ సిద్ధిస్తాయి. జ్ఙానం వికసిస్తుంది. ఇక కొరతేమున్నది. అందువలన ఏ పనైనా - పూజ కాని, పెండ్లి కాని, గృహప్రవేశం గాని, ప్రారంభోత్సవం గాని, రచనారంభం గాని, పరీక్ష గాని, ఉద్యోగం గాని - వినాయకుని పూజతోనే మొదలవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యులకూ, రచయితలకూ వినాయకుడు నిత్యారాధ్య దేవుడు


[మార్చు] కాకిరూపంలో గణపతి

(తమిళనాట ప్రచారంలో ఉన్న గాధ) అగస్త్యమహర్షి ఒకసారి కోపించి కావేరీనదీ జలాలను తన కమండలంలో బంధించివేశాడు. ప్రజల ఇబ్బందిని గమనించి, ఇంద్రుడు ప్రార్ధించగా అప్పుడు వినాయకుడు కాకి రూపంలో వెళ్ళి నీటిని త్రాగుతున్నట్లు నటిస్తూ ఆ కమండలమును దొర్లించి ఎగిరిపోయాడు. మళ్ళీ కావేరి నది మామూలుగా ప్రవహించసాగింది. తన తొందరపాటును తెలిసికొని అగస్త్యుడు వినాయకుని స్తుతిచాడు.

[మార్చు] భూకైలాస్ కధ

(తెలుగునాట ప్రసిద్ధి చెందిన నాటకము) ఒకసారి రావణుడు శివుని మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని కోరాడు. శంకరుడే లింగరూపుడై రాణును చేతికి వచ్చాడు. కాని ఎక్కడ నేలమీద పెడితే అక్కడే ప్రతిష్టితమౌతానని చెప్పాడు. సంధ్యా వందనసమయం అయినందున రావణుడు ఆ లింగాన్ని ఎక్కడ ఉంచాలో ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వినాయకుడు బాల బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. రాణుడు శివలింగాన్ని పట్టుకోమని కోరాడు. కాని ఆయన 'నేను నీ అంత బలవంతుని కాను'. మోయలేకపోయినప్పుడు మూడుసార్లు పిలిస్తాను. నువ్వు రాకుంటే క్రింద పెట్టేస్తానని షరతు విధించి ఆత్మలింగాన్ని తీసికొన్నాడు. సంధ్యావందనం మధ్యలో మూడుసార్లు పిలిచినా సమయానికి రావణుడు రాలేకపోయాడు. బరువు మోయలేనివానివలె గణపతి ఆత్మలింగాన్ని నేలమీద పెట్టనే పెట్టాడు.

[మార్చు] మహాభారతానికి వ్రాయసకాడు

వేదాలను విభజించిన వేదవ్యాసుడు పంచమవేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించాడు. తాను చెప్తూ ఉంటే వ్రాయగల సమర్ధునికోసం గణపతిని ప్రార్ధించాడు. గణపతి ఒక నియమాన్ని విధించాడు - వ్యాసుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి. ఒప్పుకొన్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు - తాను చెప్పినదానిని పూర్తిగ అర్ధం చేసుకొనే గణపతి వ్రాయాలి. అలా ఒప్పందం ప్రకారం భారత కథా రచన సాగింది. తన దంతాన్నే ఘంటంగా గణపతి వినియోగించాడు. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనది.

[మార్చు] వినాయకుని ఆకారంలోని సంకేతాలు

వినాయకుని ఆకారం పై ఎన్నో చర్చలు, అభిప్రాయాలు, తత్వార్ధ వివరణలు, కధలు ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం - ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు.

  • వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" (ప్రణవం)ను పోలి ఉన్నదని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ప్రియమైన విషయం. ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ ఎన్ని బొమ్మలు గీయబడ్డాయో చెప్పలేము. ఎందరో చిత్రకారులు ఈ విషయంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
  • వినయకుని తొండము "ఓం"కారానికి సంకేతమని చెబుతారు.
  • ఏనుగు తల - జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము.
  • మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము
  • చేతిలో పరశువు - అజ్ఙానమును ఖండించడానికి సంకేతము
  • చేతిలో పాశము - విఘ్నాలు కట్టిపదవేసే సాధనము
  • విరిగిన దంతము - త్యాగానికి చిహ్నము
  • మాల - జ్ఙాన సముపార్జన
  • పెద్ద చెవులు - మ్రొక్కులు వినే కరుణామయుడు
  • పొట్టపై నాగ బంధము - శక్తికి, కుండలినికి సంకేతము
  • ఎలుక వాహనము - జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి.

[మార్చు] పండుగలు, ఆచారాలు, దేవాలయాలు

[మార్చు] వినాయక చవితి

[మార్చు] కాణిపాకం

[మార్చు] అవీ ఇవీ

[మార్చు] 32 గణపతులు

ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు). ఇంకా అవాంతర భేదగణపతులు 11 - మొత్తం 32

  1. శ్రీ గణపతి
  2. వీర గణపతి
  3. శక్తి గణపతి
  4. భక్త గణపతి
  5. బాల గణపతి
  6. తరుణ గణపతి
  7. ఉచ్చిష్ట గణపతి
  8. ఉన్మత్త గణపతి
  9. విద్యా గణపతి
  10. దుర్గ గణపతి
  11. విజయ గణపతి
  12. వృత్త గణపతి
  13. విఘ్న గణపతి
  14. లక్ష్మీ గణపతి
  15. నృత్య గణపతి
  16. శక్తి గణపతి
  17. మహా గణపతి
  18. బీజ గణపతి
  19. దుంఢి గణపతి
  20. పింగళ గణపతి
  21. హరిద్రా గణపతి
  22. ప్రసన్న గణపతి
  23. వాతాపి గణపతి
  24. హేరంబ గణపతి
  25. త్ర్యక్షర గణపతి
  26. త్రిముఖ గణపతి
  27. ఏకాక్షర గణపతి
  28. వక్రతుండ గణపతి
  29. వరసిద్ధి గణపతి
  30. చింతామణి గణపతి
  31. సంకష్టహర గణపతి
  32. త్రైలోక్యమోహనగణపతి


[మార్చు] ప్రార్ధనలు, కీర్తనలు

వినాయకుని ప్రార్ధనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము. ప్రతి పనికీ, రచనకూ ముందు వినాయకుని ప్రార్ధించడం ఆనవాయితి గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్ధనా పద్యాలున్నాయి. ఇక సంప్రదాయ శ్లోకాలు సరేసరి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న పద్యమిది.

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమునను కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతి తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.


మరొక పద్యం కూడా విద్యార్ధులకు ఉచితమైనది.

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!


ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకము

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే

[మార్చు] వాస్తు, వీధిపోటు నివారణ

[మార్చు] ప్రత్యేకతలు

  • పత్రితో పూజ చేయడం గణపతి ఆరాధనలో ఒక ప్రత్యేకత. 21 పత్రులు లేదా 108 పత్రులు పూజకు వాడాలని శాస్త్రము. ఈ పత్రులన్నింటికీ ఆయుర్వేదవైద్యవిధానంలో మంచి ఔషధీగుణాలున్నాయి.


  • ఏ మాత్రము ఆదరణకు నోచుకోని జిల్లేడు, ఉమ్మెత్త చెట్లు వినాయకుని పూజకు వాడతారు. ఆబొజ్జ గణపయ్య వాహనం ఎలుక. - ఇలా అన్నింటి పట్లా గౌరవం చూపాలనే ఆలోచన ఈ సంప్రదాయంలో ఉండవచ్చు.


  • తెలుగు వారు వినాయకునికి ఉండ్రాళ్ళు, కుడుములు, చలిమిడి, పళ్లు నైవేద్యం పెడతారు. ఇవన్నీ నాగికత పెరగక ముందు వంటలు. నూనెలూ, వేపుళ్ళూ, దినుసులూ అవుసరం లేదు. బహుశా వినాయకుని పూజ అతి ప్రాచీన సంప్రదాయం గనుక ఇలా జరిగి ఉండవచ్చును.


  • వినాయకుడి చిత్రం పెండ్లి శుభలేఖల్లో అత్యంతప్రజాదరణ పొందిన చిత్రం. సంప్రదాయవాదులకూ, ఆధునికులకూ కూడా ఇది సామాన్యం
  • వినాయకుడి చిత్రాన్ని గీయడానికి చిత్రకారులు ఎన్నో మెళకువలూ, విధానాలూ రూపొందించారు. ఒకటి రెండు చిన్న గీతలునుంచి క్లిష్టమైన డిజైనులవరకూ ఎన్నో విధాలుగా వినాయకుని చిత్రించారు. ఎక్కువగా ఓంకారాకృతిలో వినాయకుని చిత్రించడం సామాన్యం.
  • ఇప్పుడు పల్లెల్లోనూ, చిన్న నగరాల్లోనూ, మహానగరాల్లోనూ వినాయక చవితికి విగ్రహాలు వీధివీధినా ప్రతిష్టించి, పూజలు జరిపి, పెద్దయెత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక చివరి రోజున నిమజ్జనమైతే ఒక పెద్ద కార్యక్రమమైపోతున్నది. ప్రజలకూ, ప్రభుత్వానికీ ఇది పెద్ద సవాలుగా పరిణమిస్తున్నది.


[మార్చు] ఇవికూడా చూడండి

[మార్చు] బయటి లంకెలు