త్రిపురనేని రామస్వామి
వికీపీడియా నుండి
కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామిి ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త. త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15న కృష్ణా జిల్లా, అంగలూరు గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించాడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యము మరియు తొలి నాళ్లు
రామస్వామి రైతు కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆదే సంవత్సరము ఆయన పల్నాటి యుద్ధము ఆధారముగా కారెంపూడి కదనం, మహాభారత యుద్ధము ఆధారముగా కురుక్షేత్ర సంగ్రామము అను రెండు నాటికలు రచించాడు. 1911 లో ఇంటర్మీడియట్ చదవడానికి బందరు లోని నోబుల్ కాలేజీలో చేరాడు. అక్కడ ఉన్న కాలములో అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు.
[మార్చు] రాజకీయ జీవితం, సంఘ సంస్కరణ
1898 లో పున్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. 1910లో వారికి ఒక కొడుకు జన్మించాడు. ఆయనే ప్రఖ్యాత రచయిత, త్రిపురనేని గోపీచందు. 1914 లో న్యాయ శాస్త్రం చదివేందుకు డబ్లిన్ వెళ్లాడు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము మరియు ఆధునిక ఐరోపా సంస్కృతి కూడా చదివాడు. డబ్లిన్ లో చదువుతున్న రోజుల్లోనే అన్ని బీసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమంకు మద్దతు ఇవ్వవలసినదిగా భారతీయులకు విజ్ఞాపన చేసస్తూ కృష్ణా పత్రిక లో అనేక రచనలు చేశాడు. రామస్వామి స్వాంతంత్ర్యోద్యము రోజులలో ప్రజలకు స్పూర్తినిచ్చి ఉత్తేజపరచే అనేక దేశభక్తి గీతాలు రచించాడు.
1917 లో భారత దేశానికి తిరిగివచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మచిలీపట్నంలో న్యాయవాద వృత్తి నిర్వహించాడు. కానీ ఆయన ముఖ్య వ్యాసంగము సంఘ సంస్కరణే. స్మృతులు, పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన కుల వ్యవస్థ మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమము ప్రారంభించాడు. 1922 లో గుంటూరు జిల్లా, తెనాలి లో స్థిరపడ్డాడు. 1925 లో తెనాలి పురపాలక సంఘ చైర్మనుగా ఎన్నికయ్యాడు. తెనాలి మున్సిపాలిటీ చైర్మెన్ గా ఉన్నపుడు, గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించాడు. ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మను పదవి నుండి తొలగించారు. అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికై, తిరిగి చైర్మను అయ్యాడు. జంతుబలులు మాత్రం సాగలేదు. 1938 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నాడు.
1920 లో మొదటి భార్య చనిపోగా, చంద్రమతిని పెళ్ళి చేసుకున్నాడు. 1932 లో ఆమె చనిపోగా, అన్నపూర్ణమ్మ ను పెళ్ళి చేసుకున్నాడు. సూతాశ్రమం అనిపేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది.
సంస్కృత భాషలో ఉన్న పెళ్ళి మంత్రాలను తెలుగులొకి అనువదించి, అచ్చ తెలుగులో సరళమైన వివాహ విధి అను పద్ధతిని తయారు చేసాడు. ఈయన స్వయంగా అనేక పెళ్లిళ్లకు పౌరోహిత్యము వహించి జరిపించాడు. ఆంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. మనసా, వాచా, కర్మణా రామస్వామి ఓ సంస్కర్త. 1943 జనవరి 16 న త్రిపురనేని రామస్వామి మరణించాడు.
[మార్చు] సాహితీ ప్రస్థానము
ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాథనముగా త్రిపురనేని ఎంచుకున్నాడు. రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించాడు. ఈయన చేసిన ముఖ్య రచనలు:
- సూతపురాణము
- శంబూకవధ
- సూతాశ్రమ గీతాలు
- ధూర్త మావన శతకము
- ఖూనీ
- భగవద్గీత
- రాణా ప్రతాప్
- కొండవీటి పతనము
- కుప్పుస్వామి శతకం
- మాల దాసరి
- గోపాలరాయ శతకం
- పల్నాటి పౌరుషం
ఆయన సాహిత్య కృషిని గుర్తించి, ఆంధ్ర మహాసభ ఆయనకు కవిరాజు అనే బిరుదునిచ్చి గౌరవించింది. 1940లో గుడివాడ ప్రజానీకము గజారోహణ సన్మానము గావించిరి.
ఆయన ప్రసిద్ధ గేయంలోని ఒక భాగం:
-
- వీరగంధము తెచ్చినారము
- వీరుడెవ్వడొ తెల్పుడీ
- పూసిపోదుము మెడను వైతుము
- పూలదండలు భక్తితో
రైతు,దీనజన పక్షపాతిగా వారి సేవ నే తన మార్గంగా ఎంచుకొన్నారు. మానవసేవే మాధవసేవ అని నమ్మారు. చూడండి...
-
- మలమల మాడు పొట్ట , తెగమాసిన బట్ట ,కలంతపెట్టగా
- విలవిల యేడ్చుచున్న నిఱుపేదకు జాలిని జూపకుండ, ను
- త్తలపడిపోయి, జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
- పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెదన్.
మా మతం గొప్పదంటే కాదు మా మతం గొప్పదని వాదులాడే మతొన్మక్తులను ఈసడిస్తూ ....
-
- ఒకరుడు 'వేదమే' భగవ దుక్తమటంచు నుపన్యసించు నిం
- కొకరుడు 'బైబిలే' భగవదుక్తమటంచును వక్కణించు, వే
- రొంకరుడు మా ' ఖొరాన్ ' భగవదుక్తమటంచును వాదులాడు, నీ
- తికమక లేల పెట్టెదవు? తెల్పగరాదె నిజంబు నీశ్వరా.
[మార్చు] సంతానము
- రామస్వామి పెద్దకుమారుడు త్రిపురనేని గోపీచందు తెలుగులో ప్రప్రధమ మనస్తత్వ నవల అసమర్ధుని జీవయాత్ర రాసి తెలుగు సాహిత్యముపై చెరగని ముద్ర వేశాడు.
- పెద్దకుమార్తె సరోజిని దేవి భారతీయ పాలనా యంత్రాంగపు అధికారి అయిన కనుమిల్లి సుబ్బారావు ను వివాహమాడినది.
- త్రిపురనేని గోకులచందు కూడా తెలుగు సాహితీ రంగమునకు తనదైన రీతిలో తోడ్పడ్డాడు. ఈయన రచనలలో, 1950లలో వచ్చిన బెంగాల్ కరువుకు దర్పణము పట్టిన నాటకము విశిష్టమైనది.
- రామస్వామి చిన్న కుమార్తె చౌడరాణి స్వాతంత్ర్యోద్యమ సమయములో భారతీయ నావికా దళములో తిరుగుబాటుదారైన అట్లూరి పిచ్చేశ్వరరావుని పెళ్లి చేసుకొన్నది. ఈమె తమిళ నాడులో తొలి తెలుగు బుక్స్టోర్ ప్రారంభించిన తొలి మహిళ. ఈమె 1996లో చనిపోయినది.
ఈ వ్యాసం 2006 ఫిబ్రవరి 6 వ తేదీన విశేషవ్యాసంగా ప్రదర్శించబడింది. |