వికీపీడియా నుండి
[మార్చు] జనవరి 30 2006, సోమవారం
- జాతీయ అవార్డు వెనక్కిస్తున్నా -వేటూరి: తెలుగును ప్రాచీన భాషగా గుర్తించనప్పుడు తనకిచ్చిన అవార్డుకు విలువలేదని ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి వ్యాఖ్యానించారు. 1993 లో మాతృదేవోభవ సినిమాలో "రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే" అనే పాటకు తనకిచ్చిన అవార్డును తిరిగిచ్చేస్తున్నానని ప్రకటించారు.
- కోటరీ తప్పుడు సలహాలు: చుట్టూ చేరిన కోటరీ తప్పుడు సలహాలతోనే సోనియాగాంధీ ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నారని మంత్రివర్గ విస్తరణపై ఆదివారం బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తపరిచిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఆరోపించారు.
- ఆంధ్రప్రదేశ్ను చిన్న రాష్ట్రాలుగా చేద్దాం: "ఆంధ్రప్రదేశ్ను చిన్న రాష్ట్రాలుగా చేయడం కోసం ఉద్యమిద్దాం" అంటూ భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు.
- హే రాం: గాంధీ హత్య జరిగినపుడు గాంధీ 'హే రాం' అంటూ నేలకొరిగిపోయారు అని అనుకుంటూ ఉన్నాం. అయితే ఇది సరికాదని మహాత్మునికి నాడు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న వెంకిట కల్యాణం(83)వెల్లడించాడు. హత్య సమయంలో మహాత్ముని వెనుకే తాను ఉన్నానని చెప్పారు. గాడ్సే కాల్చినపుడు గాంధీ అసలు ఏ పదాన్నీ ఉచ్చరించనేలేదని వివరించాడు.
- కేంద్ర మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అన్యాయం: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అన్యాయం జరిగిందని చంద్రబాబునాయుడు విమర్శించాడు. "రాష్ట్ర జనాభాలో 50 శాతం బీసీలు. వారిలో ఒక్కరూ కేంద్ర మంత్రి పదవికి నోచుకోలేదా? ఇదేనా సామాజిక న్యాయం?" అని ఆయన అన్నాడు.
[మార్చు] జనవరి 29 2006, ఆదివారం
- ప్రాచీన భాషగా తెలుగు: తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలని, దీనికోసం ప్రజలు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకు కదలాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించాడు. కొసరాజు రాఘవయ్య చౌదరి శత జయంత్యుత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.
- కేంద్ర మంత్రివర్గ విస్తరణ: కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తూ కొత్తగా 19 మంది మంత్రులను చేర్చుకున్నారు. మరో ముగ్గురికి పదోన్నతి కల్పించారు. ఏడుగురి శాఖలు మార్చారు. కొత్తగా చేర్చుకున్నవారిలో ఏడుగురు కేబినెట్ మంత్రులు కాగా, 12 మంది సహాయ మంత్రులు. ఈ 12 మందిలో ఒకరికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. తాజా పునర్వ్యవస్థీకరణతో మంత్రుల మొత్తం సంఖ్య 79కి చేరింది.
- అసంతృప్తి: కేంద్ర మంత్రివర్గ విస్తరణ తరువాత రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. మంత్రి పదవులు దక్కని జి.వెంకటస్వామి, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, మధు యాష్కీ గౌడ్ వంటి పలువురు నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు.
- ప్రత్యేక తెలంగాణ అంశంపై భాజపా ఉద్యమిం : ప్రత్యేక తెలంగాణ అంశంపై ఒంటరిగానే ఉద్యమించాలని భాజపా తీర్మానించింది. తెలంగాణపై ఉద్యమించడానికి మార్చి నెలను ముహూర్తంగా నిర్ణయించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మద్దతివ్వాల్సిందిగా అధిష్ఠానాన్ని కోరాలని కూడా తీర్మానించారు. రాష్ట్ర శాఖ వైఖరికి ఆమోదముద్ర వేయాల్సిందిగా పార్టీ జాతీయ నూతన అధ్యక్షుడికి సీనియర్ నేతలతో కూడిన ఓ కమిటీ ద్వారా సందేశాన్ని పంపుతారు.
- రాష్ట్ర గవర్నరు రాజీనామా: రాష్ట్ర గవర్నరు సుషీల్ కుమార్ షిండే రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్గా రామేశ్వర్ ఠాకూర్ ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశాడు.
[మార్చు] జనవరి 28 2006, శనివారం
- గోదావరి జలసాధన యాత్ర: గోదావరి, ప్రాణహిత నదీ జలాలు తెలంగాణా ప్రాంతానికి అందివ్వాలని, తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవేందర్గౌడ్ సారథ్యంలో చేపట్టిన గోదావరి జలసాధన యాత్ర ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాదు జిల్లా మందమర్రి మండలం పులిమడుగు గ్రామ సమీపంలోని పాలవాగు నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర 450 కి.మీ పొడవున ఏడు జిల్లాల్లో కొనసాగనుంది. ఆయా జిల్లాల నుంచి తెదేపా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. దేవేందర్గౌడ్తోపాటు తెదేపా నాయకులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, వేణుగోపాలాచారి, ఎర్రబెల్లి దయాకర్రావు, మండవ వెంకటేశ్వర్రావు, సానా మారుతి, ఉమామాధవరెడ్డి, మాణిక్రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్మన్ సుహాసినీరెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
- కర్ణాటక రాజకీయం: కర్ణాటక ముఖ్యమంత్రి ధరం సింగ్ రాజీనామా చేసాడు. ఫిబ్రవరి మూడోతేదీన సాయంత్రం అయిదు గంటలకు జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్.డి.కుమారస్వామి ముఖ్యమంత్రిగా, భాజపా నాయకుడు, బి.ఎస్.యడియూరప్ప ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు.
- విజయవంతంగా ఆకాశ్ క్షిపణి పరీక్ష: ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణిని శనివారం ఒరిస్సా లోని చాందీపూర్ వద్ద రెండుసార్లు విజయవంతంగా పరీక్షించారు. పైలట్ రహిత విమానం నుంచి జారవిడిచిన వస్తువులను రెండుసార్లూ ఆకాశ్ ఛేదించిందని ఇక్కడి అధికార వర్గాలు తెలిపాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అత్యాధునిక క్షిపణి 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. డీఆర్డీవో ప్రస్తుతం వివిధ దశల్లో అభివృద్ధి చేస్తున్న ఐదు క్షిపణుల్లో ఆకాశ్ ఒకటి.
- యురేనియం మైనింగ్, ప్రాసెసింగ్ ప్రాజెక్టు: నల్గొండ జిల్లాలో యురేనియం మైనింగ్, ప్రాసెసింగ్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే నాగార్జున సాగర్ జలాశయానికి గాని, పర్యావరణ సమతుల్యతకు గాని ఎలాంటి హానీ జరగదని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) స్పష్టం చేసింది.
[మార్చు] జనవరి 26 2006, గురువారం
- దామాషా పద్ధతిలో ఓటింగ్: ఎన్నికలలో ప్రజాభిప్రాయం ప్రతిబింబించాలంటే.. దామాషా పద్ధతిలో ఓటింగ్ ఉండాలని లోక్సత్తా జాతీయ సమన్వయకర్త డా.జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నాడు. ఈ నూతన పద్ధతిలో ప్రతి ఓటరుకు రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటు తాను ఎన్నుకొనే అభ్యర్థి (నియోజకవర్గ ఓటు)కి వేస్తాడు. మరొక ఓటు తాను గెలిపించాలనుకున్న పార్టీకి వేస్తాడు. 50 శాతం సీట్లకు నేరుగా అభ్యర్థులు ఎన్నికైతే మిగిలిన సీట్లు పార్టీలకు లభించిన ఓట్ల ఆధారంగా లభిస్తాయి. ఈ రెండు పద్ధతులను మేళవించటం వల్ల నియోజకవర్గంలో వ్యక్తిగతంగా మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థి ప్రతినిధి కావటంతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వార్డు మెంబరు స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకూ అన్ని పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలన్నాడు.
- బూటాసింగ్ రాజీనామా : సుప్రీం కోర్టు అభిశంసనకు గురైన బీహార్ గవర్నరు బూటాసింగ్, గణతంత్ర వేడుకల్లో గౌరవ వందనం స్వీకరించాక, రాజీనామా చేసాడు.
- స్వామి పరమార్థానంద మరణం: హైదరాబాదు రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి పరమార్థానంద మరణించాడు.
[మార్చు] జనవరి 25 2006, బుధవారం
- పద్మ పురస్కారాలు: ఈ ఏటి పద్మ పురస్కారాల్లో - సినీనటుడు చిరంజీవికి పద్మభూషణ, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కు పద్మశ్రీ ప్రకటించారు. మొత్తం 9 మందికి పద్మవిభూషణ, 36 మందికి పద్మభూషణ, 61 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
- ఈ ఏటి కామన్ ఎంట్రెన్సు పరీక్షల తేదీలు ప్రకటించారు:
- ఎంసెట్ : మే 4
- ఈసెట్ : మే 14
- ఐసెట్ : మే 25
- పాసెట్ : మే 29
- లాసెట్ (5 ఏళ్లు) : జూన్ 3
- లాసెట్ (3 ఏళ్లు) : జూన్ 3
[మార్చు] జనవరి 24 2006, మంగళవారం
- బీహార్ శాసనసభ రద్దు అసమంజసం: బీహార్ శాసనసభ రద్దుపై గవర్నరు బూటా సింగ్తోపాటు, కేంద్ర ప్రభుత్వానికీ సుప్రీంకోర్టు మంగళవారం మొట్టికాయలు వేసింది. నితీశ్కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యు) ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బూటాసింగ్ వ్యవహరించారని, కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారని తేల్చిచెప్పింది. గవర్నర్ సిఫారసును పరమ సత్యంగా ఆమోదించే ముందు కేంద్రం దానిని ధ్రువీకరించుకోవాల్సిందని వ్యాఖ్యానించింది. రాజకీయాలతో సంబంధంలేని వారిని మాత్రమే గవర్నర్లుగా నియమించేలా మొత్తం గవర్నర్ల వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని సూచించింది. ఈ తీర్పు నేపథ్యంలో తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, గణతంత్ర దినం నాడు గవర్నర్గా గౌరవ వందనం స్వీకరించి తీరతానంటున్నాడు బూటాసింగ్.
- పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం సాధ్యం కాదు: పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం సాధ్యం కాదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తేల్చిచెప్పాడు. పోలవరం ఎత్తు, ముంపును తగ్గించే అంశాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా గోదావరి నదిపై బ్యారేజీలను నిర్మించాలని కొందరు నిపుణులు సూచించారనీ ఈ అంశాన్ని కూడా కమిటీ పరిశీలించిందన్నాడు. ప్రత్యామ్నాయ విధానం ద్వారా ఆశించిన స్థాయిలో నీటిని నిల్వ చేసుకోలేమని, బ్యారేజీల నిర్మాణం వల్ల ఖర్చుకూడా ఎన్నో రెట్లు పెరుగుతుందని కమిటీ పేర్కొన్నట్లు వివరించాడు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని ఎత్తును ఐదు అడుగులు తగ్గిస్తే నీటి నిల్వ సామర్థ్యం 75.2 టీఎంసీల నుంచి 47 టీఎంసీలకు పడిపోతుందని తెలిపాడు. ఎత్తు తగ్గించడం వల్ల 15 గ్రామాలు, 14,615 ఎకరాల మేర మాత్రమే ముంపు తగ్గుతుందన్నాడు. పోలవరం వల్ల ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశాడు.
- పల్లెల్లో 24 గంటలూ విద్యుత్ సరఫరా: పల్లెల్లో ఇళ్లకు 2006 ఏప్రిల్ నుండి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్కో, డిస్కమ్లు స్పష్టం చేశాయి.
[మార్చు] జనవరి 23 2006, సోమవారం
- ఖాతా ఖాళీ చేసిన కత్రోచ్చి: ఇటలీ వ్యాపార వేత్త ఒట్టావియో ఖత్రోచీ జనవరి 16 నే లండన్ బ్యాంకులోని తన రెండు ఖాతాలనుంచి సొమ్మును విత్డ్రా చేసినట్టు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. బోఫోర్స్ కేసులో ఖత్రోచీ నిందితుడైనందున ఆ రెండు ఖాతాల నుంచి సొమ్ము తరలకుండా కేంద్రానికి, సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన రోజే (జనవరి 16) ఖాతాల్లోని సొమ్ము బయటకు వెళ్లింది. ఖత్రోచీ ఖాతాలపై స్తంభనను ఎత్తివేసేముందు సీబీఐ ఒకసారి కోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదా అని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది.
[మార్చు] జనవరి 22 2006 ఆదివారం
- తెలంగాణా ఇన్స్టంట్ కాఫీ కాదు: తెలంగాణాపై ఏర్పాటు చేసిన యు.పి.ఎ. ఉపసంఘం అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెసు ప్లీనరీ సందర్భంగా హైదరాబాదులో ఇలా అన్నాడు. "తెలంగాణ కోసం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని 2000 సంవత్సరంలో సీడబ్ల్యూసీలో తీర్మానించాం. యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ అంశాన్ని సీఎంపీలో చేర్చాం. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలోనూ ఈ అంశం ఉంది. ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా రెండో ఎస్సార్సీ అనే పరిస్థితి లేదు. ఏకాభిప్రాయం, సంప్రతింపుల ద్వారానే తెలంగాణా అన్నది మా వైఖరి. ఇందుకోసం ఉపసంఘం వేశాం. పలు పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాం. కొన్ని పార్టీలు అనుకూలంగా, మరికొన్ని వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పాయి. ప్రధాన రాజకీయ పార్టీ భాజపా మాత్రం ఇప్పటివరకూ తన అభిప్రాయం వెల్లడించలేదు. ఆ పార్టీకి రెండుసార్లు లేఖ రాసినా స్పందన లేదు. వాళ్లు ఏదో ఒక నిర్ణయం చెబితే, మా కమిటీ నిర్ణయం తీసుకోవడం తేలికవుతుంది. తెలంగాణా కోసం తెరాస అధినేత కేసీఆర్ పెట్టారంటున్న రెండు నెలల గడువుతో మాకు సంబంధం లేదు. నేనెప్పుడూ గడువు చెప్పలేదు. చెప్పలేను కూడా. ఎందుకంటే అది చాలా కష్టం. తెలంగాణా ఇన్స్టంట్ కాఫీ కాదు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు."
[మార్చు] జనవరి 21 2006, శనివారం
- ఎంపీల బహిష్కరణ అంశంపై కోర్టు నోటీసులను తీసుకోరాదన్న లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ నిర్ణయం దురదృష్టకరమని, మాజీ భారత అటార్నీ జనరల్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సోలి సొరాబ్జీ అభిప్రాయపడ్డాడు. సుప్రీం నోటీసులను స్పీకర్ తీసుకుని, తాను చెప్పదలచుకున్న విషయాన్ని సమాధానంగా రాసి పంపితే బాగుంటుందన్నాడు. పార్లమెంటు, సుప్రీం కోర్టు రెండింటికీ విశేషాధికారాలు ఉన్నాయనడంలో సందేహం లేదు, అయితే తమ అధికార పరిధిపై రెండూ విచక్షణ కలిగి పరస్పరం గౌరవించుకోవాలి, ఏదీ ఎక్కువ కాదు, అలాగని తక్కువా కాదని ఆయన అన్నాడు. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీం కోర్టు నోటీసులు స్వీకరించబోననడం సముచితంగా లేదన్నారు.
- కాంగ్రెసు పార్టీ ప్లీనరీ ప్రారంభం: కాంగ్రెసు పార్టీ 82 వ ప్లీనరీ మొదలైంది. మూడు రోజులపాటు ఇది జరుగుతుంది.
[మార్చు] జనవరి 20, శుక్రవారం
- నోటీసు పుచ్చుకోను, కోర్టు పిలిచినా వెళ్లను- స్పీకరు: ముడుపులకు ప్రశ్నల వివాదంలో ఎంపీలను బహిష్కరించిన కేసులో సుప్రీం కోర్టు లోక్సభ స్పీకర్కు నోటీసు పంపడంతో ఈ అంశంపై స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసు పుచ్చుకోనని, కోర్టు పిలిచినా వెళ్లనని ఆయన తేల్చిచెప్పారు. ఆయన నిర్ణయానికి అఖిలపక్షం మద్దతు పలికింది. అసలు స్పీకర్కు నోటీసు పంపి ఉండాల్సింది కాదని అభిప్రాయపడింది. ఈ విషయంలో భాజపా మాత్రం మిగిలిన పార్టీలతో విభేదించింది. "సుప్రీంకోర్టు పంపిన నోటీసులు ఇంకా నాకు అందలేదు. అవి వచ్చినప్పుడు గౌరవప్రదంగా వెనక్కి పంపుతా" అని ఆయన అన్నాడు.
- కె.సి.ఆర్, ఉమ భేటీ: రాష్ట్ర పర్యటనకు వచ్చిన భాజపా బహిష్కృత నేత ఉమాభారతిని శుక్రవారం కేసీఆర్ తన నివాసానికి ఆహ్వానించాడు. "యూపీఏ మంత్రివర్గంలో మీరిద్దరూ సభ్యులు. మీ మాటకే అక్కడ విలువ లేనప్పుడు ఇంకా పదవుల్లో కొనసాగడంలో అర్థం లేదు. తెలంగాణ కోసం ఒత్తిడి తెండి. ససేమిరా అంటే తక్షణం పదవులు వదిలి రండి. తెలంగాణ కోసం ఉద్యమించండి." అని తెరాస అగ్రనేతలు కేసీఆర్, నరేంద్రలకు ఉమాభారతి హితవు పలికింది.
- తెరాస అసమ్మతి ఎమ్మెల్యేల బహిరంగ సభ: మెదక్ జిల్లా సంగారెడ్డిలో తెలంగాణ అభివృద్ధి శంఖారావం పేరుతో తెరాస అసమ్మతి ఎమ్మెల్యేలు భారీ బహిరంగ సభ జరిపారు. జయప్రకాశ్రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు, శారారాణి, ముకుందరెడ్డి ఇందులో పాల్గొన్నారు. "గారడీ విద్యలు... మోసపు మాటలూ ఇంకా ఎన్నాళ్లు? తెలంగాణ కోసం ఇంకా రెండు నెలలు ఎందుకు వేచి ఉండాలి? దమ్ముంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రండి! లేకపోతే మిమ్మల్నే ప్రజలు రాళ్లతో కొట్టే రోజు వస్తుంది. కేసీఆర్ ఖబడ్దార్" అంటూ వీరు విమర్శించారు. తెలంగాణ నినాదాన్ని అమ్ముకొని సింగపూర్, మలేషియాల్లో ఆస్తులు కూడబెడుతున్నారని దుగ్యాల విమర్శించాDu.
- పోతిరెడ్డిపాడు జి.ఓ. పై నిరసన: అయిదు జిల్లాల ఎన్.ఎస్.పి. ఆయకట్టు రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకం చేస్తున్న 'పోతిరెడ్డిపాడు' జి.ఒ.లపై దేశం పార్టీ సమర శంఖం పూరిచింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి మాజీమంత్రి నెట్టెం రఘురాం అధ్యక్షతన జరిగిన పాదయాత్ర ప్రారంభ సభలో మాజీ మంత్రులు కోడెల శివప్రసాద్, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కరణం బలరామ్, దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నన్నపునేని రాజకుమారి, గుత్తా సుఖేంద్రరెడ్డి, అంబటి బ్రాహ్మణయ్య తదితరులు ప్రసంగిస్తూ పోతిరెడ్డిపాడుపై విడుదలైన అక్రమ జీవోలు ఉపసంహరించుకునేవరకు ఉద్యమం సాగుతుందని అన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో జరిగిన బహిరంగసభ అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి 477 కి.మీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
[మార్చు] జనవరి 19 2006, గురువారం
- సహారా ఎయిర్లైన్స్ అమ్మకం: రూ.2,300 కోట్లు చెల్లించి సహారాను జెట్ ఎయిర్వేస్ కొనుగోలు చేసింది. దీంతో దేశీయ మార్కెట్లో జెట్ వాటా 45 శాతానికి పెరుగుతుంది. కొత్తగా 27 విమానాలు, 22 పార్కింగ్ బేలు దాని చేతికొస్తాయి. భారత విమానయాన రంగంలోనే ఈ ఒప్పందం అతిపెద్దది.
- ఎస్సీల వర్గీకరణ: ఎస్సీల వర్గీకరణపై రాష్ట్రప్రభుత్వం హామీ ఇవ్వాల్సిందేనని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తేల్చిచెప్పింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేత సానుకూల ప్రకటన చేయించాలని డిమాండ్ చేసింది. జాతీయ పార్టీలైన సీపీఎం, సీపీఐ, భాజపాలు వర్గీకరణకు అనుకూల ప్రకటన చేసినా కాంగ్రెస్ నుంచి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. మాలల నేతల ఒత్తిడికి లొంగే ఆ పార్టీ వెనుకాడుతోందని ఆరోపించారు.
[మార్చు] జనవరి 18 2006, బుధవారం
- 1000 కోట్ల రూపాయల అవినీతి: సాగునీటి ప్రాజెక్టుల్లో 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, మొత్తం ప్రభుత్వంలోనే అవినీతి ఉందంటూ ధ్వజమెత్తాడు. ప్రభుత్వం తనకు పంపిన లీగల్ నోటీసును బుధవారమే చూశానని తెలిపాడు. ఒక్క సాగునీటి శాఖలోనే కాదు. అన్ని శాఖల్లోనూ అవినీతి ఉంది. సాగునీటి ప్రాజెక్టుల్లో వెయ్యికోట్ల అవినీతి జరిగిందని ఇప్పుడే కాదు... ఇంతకుముందూ చెప్పాను. కొన్ని పత్రికల్లో వ్యాసాలూ రాశాను. వోక్స్వ్యాగన్, దేవాదాయ భూముల కుంభకోణం నుంచి... మొన్నటి ఉపాధ్యాయుల బదిలీల వరకూ అవినీతిమయమే అని రాఘవులు పేర్కొన్నాడు. పలు విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తమను భయపెట్టి, బెదిరించి, నోరు మూయించేందుకేనని ప్రభుత్వం లీగల్ నోటీసు పంపిందని ఆరోపించాడు.
- ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్న చందంగా తెరాస అధినేత కేసీఆర్ వ్యవహరిస్తున్నారని సీపీఎం శాసనసభా పక్షనేత నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. సమస్యల విషయంలో తమకు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్న ప్రాంతీయ విభేదాలు లేవని నోముల అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులుపై కేసీఆర్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. వామపక్షాలతో కయ్యం పెట్టుకున్న వాళ్లంతా భూస్థాపితం అయ్యారన్న విషయం కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు.
- ఎన్టీఆర్ జాతీయ అవార్డును పునరుద్ధరించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. భారత చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలు చేసినవాళ్లకి ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతలకు రూ. 5 లక్షలు నగదు అందించి సత్కరిస్తారు. 2003, 2004, 2005 సంవత్సరాలకు సంబంధించిన ఎన్టీఆర్ జాతీయ అవార్డులను 2006 నవంబరు 1న, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందించాలని తీర్మానించారు.
[మార్చు] జనవరి 17 2006, మంగళవారం
- తెలంగాణ ద్రోహులను రాళ్ళతో కొట్టండి - కె.సి.ఆర్:ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ద్రోహం తలపెట్టిన వారిని బట్ట లూడే వరకు కొట్టి, ప్రజా బహిష్కారం చేయాలని టిఆర్ఎస్ అధినేత, కేంద్రమంత్రి కె.చంద్రశేఖర్రావు కార్యకర్తలకు పిలుపు ఇచ్చాడు. మెదక్ జిల్లా రామా యంపేటలో మంగళవారం జరిగిన మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించాడు. ఆంధ్రప్రాంతం వారికన్నా ఇంటి దొంగలే ప్రమాదమంటూ, దొంగలు కాబట్టే వారు లెజిస్లేచర్ పార్టీ సమావేశా నికి రాలేదని ముగ్గురు ఎమ్మెల్యేలపై విరుచుకు పడ్డాడు. ద్రోహులు, వెన్నుపోటుదారులను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించరాదని, అలాంటి వారిని రాళ్లతో కొట్టాలన్నాడు. ఉద్యమ ద్రోహులకు ఆ జిల్లా నాయకులే ప్రజాక్షేత్రంలో బుద్ది చెప్పాలని అన్నాడు. ఆంధ్రజ్యోతి
- గ్రీన్కార్డు మోసగాడు నరేంద్ర మందలప అరెస్టు: తప్పుడు ధృవీకరణ పత్రాలు, తప్పుడు వీసాలు, తప్పుడు గ్రీన్కార్డులు సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఎన్ఆర్ఐ నరేంద్ర మందలపను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు అరెస్టు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈయనకు సంబంధించిన దాదాపు 57 లక్షల డాలర్ల ఆస్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఆంధ్రజ్యోతి
- నటి శాంతకుమారి మరణం: తెలుగు చిత్ర పరిశ్రమ ఆప్యాయంగా 'అమ్మ' అని పిలుచుకునే అలనాటి నటి శాంతకుమారి మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నై లోని స్వగృహంలో మరణించింది. 1920 మే 17 న ప్రొద్దుటూరు లో జన్మించిన శాంతకుమారికి మరణించే నాటికి 86 సంవత్సరాలు. ప్రఖ్యాత దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి అయిన శాంతకుమారి 1936లో శశిరేఖా పరిణయం సినిమాతో నట జీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటించింది.
[మార్చు] జనవరి 16 2006, సోమవారం
- తెలంగాణకు ద్రోహం చేస్తే ప్రళయ భీభత్సం:ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ ద్రోహం చేస్తే సహించేది లేదని, ప్రళయ బీభత్సాన్ని సృష్టిస్తామని తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు హెచ్చరించాడు. వచ్చేనెలలో యు.పి.ఎలోని భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రత్యేక తెలంగాణపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామని ప్రకటించాడు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసే వారిని రాళ్ళతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చాడు.ఆంధ్రజ్యోతి
- తెలంగాణ అనుమానమే: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్లోనూ, కేంద్రంలోనూ ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని తెలంగాణపై కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్ సూచనప్రాయంగా వెల్లడించాడు. ప్రత్యేక తెలంగాణపై ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బిజెపి, డిఎంకె తమ వైఖరులు వెల్లడించలేదని తెలిపాడు. శాసనసభలో తీర్మానం ఆమోదిస్తేనే తెలంగాణ ఏర్పాటు సాధ్య మవుతుందని స్పష్టం చేశాడు.
- షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను ఒక వర్గమే వ్యతిరేకిస్తోందని, మిగతా అన్నివర్గాలు, రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కోనేరు రంగారావు వెల్లడించాడు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఒక సమావేశానికి హాజరైన మంత్రి కోనేరు తనను కలసిన విలేఖరులతో మాట్లాడుతూ మాలలకు తాను ఎన్నడూ వ్యతిరేకం కాదన్నాడు. తన అల్లుడు, పెద్దకోడలు, మేనల్లుడి భార్య మాలలేనని తన మనవరాలిని కూడా మాల కులస్తులకే ఇచ్చానని చెప్పాడు. మాల మాదిగల మధ్య ఐక్యత బలపడాలంటే వారి మధ్య బంధుత్వాలు పెరగాలని అంబేద్కర్ చెప్పేవారని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మాల కులస్తులతో తాను బంధుత్వాలు పెంచుకుంటున్నానని మంత్రి వివరించాడు. ఆంధ్రజ్యోతి
- హైదరాబాదులో బిట్స్: ప్రతిష్ఠాత్మకమైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్ (బిట్స్)ను రంగారెడ్డి జిల్లా పరిధిలో, హైదరాబాదు నుండి కరీంనగర్ వెళ్ళే దారిలో హకీంపేట విమానాశ్రయానికి సమీపంలో షామీర్పేటకు దగ్గరలో ఉన్న జవహర్నగర్వద్ద 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2006 మార్చిలో పనులు ప్రారంభించి 2007 విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ తరగతులను నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
[మార్చు] జనవరి 15 2006, ఆదివారం
- తెరాస శాసనసభాపక్ష సమావేశం: హైదరాబాదులో జరిగిన తెరాస శాసనసభాపక్ష సమావేశం వాగ్వివాదాలతో హోరెత్తిపోయింది. అగ్రనేతలు కె.సి.ఆర్, నరేంద్రలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసమ్మతి ఎమ్మెల్యేలు దుగ్యాల శ్రీనివాసరావు, తూర్పు జయప్రకాశ్రెడ్డి, బండారి శారారాణిలు ఈ భేటీకి హాజరు కాలేదు. దీనిపై అధిష్ఠానం ఆగ్రహించింది. వారు ఎమ్మెల్యే పదవులకు, పార్టీకి రాజీనామా చేయాల్సిందిగా తీర్మానించాలన్న ప్రతిపాదన తెచ్చింది. అయితే దీనిపై తీవ్ర విభేదాలు తలెత్తాయి. వాడివేడి చర్చ జరిగింది. ఇద్దరు అసమ్మతి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. చివరికి సమావేశానికి హాజరుకాని ముగ్గురు ఎమ్మెల్యేలూ తెలంగాణ ఉద్యమ ద్రోహులని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించాడు. అసమ్మతి నాయకుడిగా ఇంతకాలం వ్యవహరించిన మందాడితో పాటు కంభంపాటి లక్ష్మారెడ్డి కూడా అధిష్ఠానంతో గళం కలిపారు.
- కె.సి.ఆర్ ఇలా అన్నాడు: "మీరు ఉద్యమ ద్రోహులు. తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతుల్లో పావులయ్యారు. అందుకే... శాసనసభా పక్ష భేటీ కోసం నానాయాగీ చేసి, ఇప్పుడు ముఖం చాటేశారు. పార్టీ పైనా, అధ్యక్షుడినైన నా పైనా, చివరికి నేటి భేటీపైనా నీలాపనిందలు వేశారు. మీకే చీమూ నెత్తురూ ఉంటే... తెలంగాణ బిడ్డలైతే... పార్టీకీ, శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేసి మళ్లీ గెలవండి"
- శారారాణి ఇలా అంది:తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు తనను తెలంగాణ ద్రోహిగా అభివర్ణించడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే శారారాణి ఇలా అంది.. "ఇంకా బుద్ధి రాలేదా? మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పారు. సహకార ఎన్నికల్లో నామరూపాల్లేకుండా చేశారు. అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అన్నావు. కేంద్రంలో మంత్రిపదవుల్లో ఊరేగుతున్నావు. ప్రజల్ని మభ్యపెడుతున్నావు. నీదే అసలు సిసలు ద్రోహం. ముందు నువ్వు రాజీనామా చెయ్యాలి. ఎంపీగాను, కేంద్ర మంత్రి పదవికీ రెండింటికీ చేయాలి. ఆనక మళ్లీ పోటీ చేసి గెలువు. ఆ తర్వాత మేం చేస్తాం. రాజీనామా చేసి గెలుస్తాం.
- అక్కినేని నాగేశ్వరరావు అవార్డు: అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏర్పాటైన ప్రతిష్ఠాత్మక అవార్డును ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా దేవానంద్కు ప్రదానం చేసారు. అవార్డు కింద రూ.3 లక్షల నగదు బహుమతిని ఆయనకు అందజేశారు.
[మార్చు] జనవరి 14 2006, శనివారం
- రోడ్డు మీదే స్నానం, భోజనం: తెదేపా అధికార ప్రతినిధి ఎం.వి.మైసూరారెడ్డి ఇంట్లోకి వెళ్లే మార్గాన్ని ప్రభుత్వం మూసేసింది. దీనికి నిరసనగా ఆయన రోడ్డునే బసగా చేసుకున్నాడు. కాలకృత్యాలను రోడ్డు పక్కనే తీర్చుకున్నాడు. రోడ్డు మీదే స్నానం, భోజనం చేశాడు. పానీయాలు సేవించాడు. టెంట్ వేసుకుని అక్కడే నిద్రించాడు.
- పాలారు నదిపై ఆనకట్టను వ్యతిరేకిస్తాం: పాలారు నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనకట్ట నిర్మిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని తమిళనాడు గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలా తమిళనాడు శాసన సభ సమావేశాలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ స్పష్టం చేశాడు. ఈ నిర్మాణం పూర్తిచేసిన పక్షంలో తమిళనాడులోని వేలూరు, ఆర్కాడు, గుడియాట్టం తదితర ప్రాంతాలలోని రైతులు తీవ్రంగా నష్టపోతారని, తాగునీటి సమస్య కూడా తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.
[మార్చు] జనవరి 12 2006, గురువారం
- బయోడీజిల్పై ఆర్టీసీ దృష్టి: డీజిల్ ధర భారంగా మారడంతో దానికి బదులు చౌకైన బయోడీజిల్ను వినియోగించడంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ దృష్టి పెట్టింది. అధికారులు కొన్ని నెలలుగా హైదరాబాద్లో బయోడీజిల్తోనే ఒక బస్సును ప్రయోగాత్మకంగా నడపుతున్నారు. దీనికి నెలకు వంద లీటర్లకు పైగా బయోడీజిల్ను వినియోగిస్తున్నారు. డీజిల్ ధర లీటరు రూ.34 కాగా, బయోడీజిల్ను హైదరాబాద్ బస్సుకు లీటరు రూ.25కే సరఫరా చేస్తున్నారు. అయితే బయోడీజిల్ సేకరణే ఆర్టీసీకి కష్టమైన పనిగా మారింది. బయోడిజీల్ను ఎంత సరఫరా చేసినా కొనడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ ఆర్టీసీ ఇటీవలే ప్రతికల్లో ప్రకటన ఇచ్చింది. దీనికి పెద్దగా స్పందన రాలేదు. కారణం... రాష్ట్రంలో ఇంకా పెద్ద ఎత్తున బయోడీజిల్ సరఫరా కావట్లేదు. దీన్ని శుద్ధి చేయకుండా తమకు సరఫరా చేసినా తాము శుద్ధి చేసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఈనాడు
- స్పీకర్కు, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు: లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీకి, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. లోక్ సభలో ప్రశ్నలు అడగడానికి ముడుపులు స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణపై తనను సభ నుంచి బహిష్కరించడాన్ని లాల్ చందర్ కోల్ సవాలు చేస్తూ పెట్టుకున్న పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ విజేందర్ జైన్, జస్టిస్ రేఖా శర్మలతో ఏర్పాటైన ధర్మాసనం పరిశీలించి, నోటీసులిచ్చింది. రెండు వారాల్లోపల ఈ నోటీసులకు సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది.
- బోగస్ ఓటర్లు కాదు: ఓటర్ల జాబితాలో పెద్దసంఖ్యలో బోగస్ ఓటర్లు ఉన్నారంటూ వచ్చిన వార్తలపై పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో మీడియా అతిగా స్పందించిందని, గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిందని ఆయన అన్నాడు. అసలు బోగస్ ఓటర్లంటే ఏమిటో నాకర్థం కావడంలేదు. ఓటర్లలో కొందరు చనిపోయుంటారు ..మరికొందరు అడ్రస్ మారి ఉంటారు. అలాంటి వారిని జాబితా నుంచి తొలగించాలి. అదే ప్రక్రియ కొనసాగుతోంది. దీనికింత వివాదమెందుకు అని బసు అన్నాడు.
[మార్చు] జనవరి 11 2006, బుధవారం
- రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తాను ఎమ్మెల్యేనో, ఎంపీనో కావాలనుకుంటే 1998లో అయ్యేవాడినని, నాటి దేశం అధినేత చంద్రబాబు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఇచ్చారని చెప్పారు. కానీ తనకు పదవుల కంటే ఎస్సీల వర్గీకరణే ముఖ్యమని పేర్కొన్నారు.
[మార్చు] జనవరి 10 2006, మంగళవారం
- యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణ రాదు: తెలంగాణా విషయమై కాంగ్రెసు సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి ఇలా అన్నాడు: "కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నంతకాలం తెలంగాణ రాదుగాక రాదు. వస్తుందనుకోవడం బక్వాస్. తెలంగాణ ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉన్నా... ఈ సంకీర్ణ ప్రభుత్వంలో సాధ్యమైతలేదు. తెలంగాణకు అడ్డుకాలేసిన లెఫ్ట్ పార్టీల వద్దే 64 ఎంపీల బలముంది. ఇగ తెలంగాణ ఎట్లొస్తది? సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాలి. రెండో ఎస్సార్సీ ఏర్పడాలి. అప్పుడే ప్రత్యేక తెలంగాణ సాధ్యం. రెండో ఎస్సార్సీ ఏర్పడితే దాని ఛైర్మన్ మనోడుంటడు. ఎస్సార్సీ నిబంధనలను, విధి విధానాలనూ మనకు అనుకూలంగా ఖరారు చేసుకోవచ్చు. ఆర్నెల్లలో తెలంగాణ వస్తది. కానీ రెండో ఎస్సార్సీకి తెరాస ఒప్పుకోలేదు. లేదంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేది"
- స్క్రామ్జెట్: శబ్ద వేగానికి అనేక రెట్ల వేగంతో ప్రయాణించగల స్క్రామ్జెట్ పరిజ్ఞానాన్ని భారత్ సొంతం చేసుకుంది. ప్రపంచంలో అమెరికా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో దేశంగా చరిత్ర సృష్టించింది. తిరువనంతపురంలోని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో దేశీయంగా రూపొందించిన స్క్రామ్జెట్ను విజయవంతంగా పరీక్షించారు.
[మార్చు] జనవరి 9 2006, సోమవారం
- ప్రత్యేక తెలంగాణ ఇచ్చేస్తామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెసు చెప్పలేదని అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా తెరాసతో పొత్తు కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర మంత్రి డి.శ్రీనివాస్ వెల్లడించాడు.
- పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం సాధ్యం కాదనీ, దానివల్ల ఆశించిన ప్రయోజనాలు అందకుండా పోతాయనీ నిపుణుల కమిటీ తేల్చింది. ఈ విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లు టి. హనుమంతరావు, ధర్మారావు, జోగారావు అందజేసిన ప్రతిపాదనలు సాంకేతికంగా, ఆర్థికంగా ఆచరణ సాధ్యం కావని నిర్ధారణకు వచ్చింది.
- ప్రశ్నలకు ముడుపుల విషయంలో సుప్రీం కోర్టు "ఏ చట్టం కింద, ఏ నిబంధన కింద ఎంపీలను సభలనుండి బహిష్కరించారు? రెండు వారాల్లో మీ సమాధానం చెప్పండి" అంటూ కేంద్రానికి, లోక్సభ స్పీకరు సోమనాథ ఛటర్జీకి, రాజ్యసభ ఛైర్మన్కు, ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీచేసింది.
[మార్చు] జనవరి 8 2006, ఆదివారం
- తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రాజకీయ విమర్శలకు వేదికైంది. ఆలె నరేంద్ర, పి.జనార్ధనరెడ్డి ల మధ్య వాగ్యుద్ధానికి కారణమైంది. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసుకు పుట్టగతులుండవని నరేంద్ర అనగా, మాకు అప్పుడుండవేమో గాని, మీకు ఇప్పటికే పుట్టగతులు లేకుండా పోయాయి అని జనార్ధనరెడ్డి అన్నాడు.
- తెలుగుకు ప్రాచీనభాష హోదా: తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించే విషయమై తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు జరిగింది. ఖేంద్ర మంత్రి దాసరి, సురవరం సుధాకరరెడ్డి ప్రసంగించినవారిలో ఉన్నారు.
- ఐపీఎస్ అధికారి హంతకుడు... లష్కరే తోయిబా అగ్రనేత, కరుడుగట్టిన ఉగ్రవాది ముజీబ్కు క్షమాభిక్ష రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఈనాడులో వార్త వచ్చింది.
- ఫోను టాపింగు: నా ఫోను టాపింగు చేసారంటూ అమర్ సింగు బాబుతో చెప్పుకోడానికి వస్తే, బాబు ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ, నా ఫోను కూడా ఏడాదిగా టాపింగవుతోందంటూ అన్నాడు.
- ఎన్కౌంటర్: బస్సు దోపిడీల నేరస్తుడు కొక్కుల రాజు పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించాడు.
- జ్ఞానపీఠ అవార్డు: ఆధునిక మరాఠీ కవిత్వంలో సుప్రసిద్ధుడైన వృందా కరందికర్ 2003 వ సంవత్సరపు జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికయ్యాడు.
[మార్చు] జనవరి 7 2006, శనివారం
- పోలవరం కడితే తమ పట్టు పోతుందని భయపడుతున్నామని ముఖ్యమంత్రి అనడాన్ని సి.పి.ఎం. నేత బి.వి.రాఘవులు తప్పుబట్టాడు.
- తెరాస అసంతృప్త ఎమ్మెల్యేల తీరు మారాలి:ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలను తెరాస హెచ్చరించింది. అన్నింటికీ సమాధానమిస్తానని అధినేత కేసీఆర్ చెప్పినా... ప్రజా ఉద్యమం చేయొద్దంటూ మీడియా ముందుకు వెళ్ళటంతో వారి అసలు రంగు బయటపడిందని తెరాస స్పష్టం చేసింది.
- ప్రవాసీ భారతీయ దివస్:హైదరాబాదులో ప్రవాసీ భారతీయ దివస్ ను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించాడు. ఎలాంటి చర్యలు తీసుకొంటే వెనకబడిన తెలంగాణ ప్రగతి సాధిస్తుందో ఆర్థిక వేత్తలు లోతుగా అధ్యయనం చేయాలని ఆయన పిలుపునిచ్చాడు.
- వై.ఎస్ పై నరేంద్ర మోడీ విమర్శ: ఆంధ్రప్రదేశ్ ఐఎస్ఐకి అడ్డాగా మారుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న పాక్ ప్రేరిత ఐఎస్ఐ కార్యకలాపాలను నియంత్రించాల్సిన వైఎస్ సర్కారు దీర్ఘనిద్రలో ఉంది. దీనివల్ల దేశానికి కలగబోయే అనర్థాలకు సర్కారే బాధ్యతవహించాల్సి ఉంటుంది అని గుజరాత్ ముఖ్యమంత్రి హెచ్చరించాడు.
- "వ్యక్తిగా, ముఠానేతగా నువ్వు ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేకపోవచ్చు. కానీ ఓ రాష్ట్ర సీఎంగా, ప్రభుత్వాధినేతగానైనా ప్రజాస్వామ్య విలువల ప్రకారం నడుచుకో! నువ్వు కూర్చున్న కుర్చీని కించపరచవద్దు" అని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి తెదేపా హితవు పలికింది.
[మార్చు] జనవరి 6 2006, శుక్రవారం
- పత్యేక తెలంగాణా డిమాండుపై కాంగ్రెస్ వైఖరేంటో హైదరాబాద్లో జరిగే పార్టీ ప్లీనరీలో ఏఐసీసీ రాజకీయ తీర్మానం స్పష్టంచేస్తుందని రక్షణమంత్రి, పార్టీ సీనియర్నేత ప్రణబ్ముఖర్జీ సూచనప్రాయంగా చెప్పాడు.
- సాగునీటి ప్రాజెక్టులలో 1000 కోట్ల ముడుపులు చేతులు మారాయని రాఘవులు ఆరోపణ, దానిపై ఈనాడు ప్రచురించిన కార్టూనులపై ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించాడు. ఎద్దు ఇనిందని రాఘవులంటే, గాట కాట్టమని ఈనాడు అన్నదంటూ పోల్చాడు. ప్రస్తుతం ఆంధ్ర జ్యోతిని చదవడం లేదని కూడా ఆయన అన్నాడు. పోలవరం కడితే సి.పి.ఎం.కు ఖమ్మం జిల్లాలో పట్టు పోతుందని భయం అని విమర్శించాడు.
- పోలవరం ప్రాజెక్టు విషయమై జరిగిన అఖిలపక్ష సమావేశం ఏ నిర్ణయమూ తీసుకోకుండా ముగిసింది. తిరిగి జనవరి 13 న సమావేశమవ్వాలని నిర్ణయం తీసుకుంది.
[మార్చు] జనవరి 5 2006, గురువారం
- గ్రామీణ న్యాయవ్యవస్థను పటిష్టం చెయ్యాలని రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నాడు.
- సాగునీటి ప్రాజెక్టులలో 1000 కోట్ల ముడుపులు చేతులు మారాయని రాఘవులు ఆరోపణపై స్పందిస్తూ రాఘవులు చెప్తే, నిజమే అయిఉండవచ్చు అని సి.పి.ఎం. జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నాడు.
[మార్చు] జనవరి 4 2006, బుధవారం
- ముస్లిములకు 5% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన అప్పీలుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు. కేసు విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.
- తెలంగాణ రాష్ట్ర సాధనలో జరుగుతున్న జాప్యాన్ని ఇక చూస్తూ కూర్చునే ఓపిక తమకు లేదని కేంద్ర మంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశాడు. ఎనిమిది వారాల్లో ఇస్తామన్న ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఏడాదైన వెలుగు చూడకపోవడమేమిటని అసంతృప్తి వ్యక్తం చేశాడు. పార్టీ సంస్థాగత నిర్మాణం, తెలంగాణ సాధన దిశగా యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను ఏకకాలంలో చేపట్టనున్నట్లు చెప్పాడు.
- సాగునీటి ప్రాజెక్టులలో 1000 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని సి.పి.ఎం. నేత బి.వి.రాఘవులు చేసిన ఆరోపణను ముఖ్యమంత్రి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కె.కేశవరావు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి విమర్శలు చేసేందుకు ఆయన ఒక పత్రిక పెట్టుకుంటే మంచిది అని కేశవరావు అన్నాడు.
[మార్చు] జనవరి 3 2006, మంగళవారం
- నల్గొండలో పాకిస్తాను ప్రేరేపిత ఉగ్ర్రవాది: బెంగుళూరు ఐండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్పై దాడి కేసులో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ లింకు బయటపడింది. దాడికి వ్యూహం పన్నినట్లు భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్(35)ను ఆంధ్రప్రదేశ్లోని నల్గొండలో పట్టుకున్నారు. స్థానిక పోలీసుల సాయంతో బెంగుళూరు పోలీసులు శనివారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఈనాడు
- ఔటర్ రింగురోడ్డుకు ప్రధాని శంకుస్థాపన: హైదరాబాదు ఔటరు రింగురోడ్డుకు భారత ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేసాడు.
- సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల నుంచి పాలకులు వెయ్యి కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని బి.వి.రాఘవులు మహబూబ్ నగర్లో ఆరోపించారు.
[మార్చు] జనవరి 2 2006, సోమవారం
- భీభత్సానికి తీవ్రవాదుల కుట్ర: మూడు అత్యంత ప్రమాదకరమైన బాంబులు. పాకిస్థాన్ గూఢచారసంస్థ ఐఎస్ఐ పన్నిన కుట్ర మేరకు 8 నెలల కిందటే ముగ్గురు యువకుల ద్వారా హైదరాబాద్ చేరాయి. వాటిని ఇక్కడే దాచిపెట్టిన ఆ యువకులు... హైదరాబాద్ను అల్లకల్లోలం చేయటానికి పథకం వేశారు. బాంబుల్ని పేల్చటానికి... వాటికన్నా ప్రమాదకరమైన మానవ బాంబుల కోసం వెదికారు. ఇంతలో హైదరాబాద్ వాసుల అదృష్టం బాగుండి... వారి కుట్ర భగ్నమైంది. ఈనాడు
- ఆచార్య నాగార్జునుడు రెండో బుద్ధుడు:బుద్ధుడు ప్రబోధించిన కాలం నాటి కంటే ఈ రోజే ఎక్కువ అవసరమని బౌద్ధమత గురువు దలైలామా పేర్కొన్నారు. అమరావతిలో కాలచక్ర ఉత్సవాల నిర్వహణకు రాష్ట్రానికి వచ్చిన దలైలామా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హిందూయిజం, బౌద్ధం కవలల వంటివన్నారు. ఆచార్య నాగార్జునుని రెండో బుద్ధునిగా దలైలామా అభివర్ణించారు. ఆచార్యుని బోధలు చదివే ఆధ్యాత్మికంగా తన మనోనేత్రం తెరుచుకుందన్నారు. ఆ మహనీయుడు తిరుగాడిన ప్రాంతంలో కాలచక్ర ప్రవచనాలకు తాను పునఃప్రారంభం చేయడం జీవితంలో ఎంతో సంతోషాన్నిస్తోందని చెప్పారు. ఈనాడు
- నీలోఫర్ ఆసుపత్రిలో విద్యుత్తు షాకుకు గురై పసికందు మరణం: 20 రోజుల వయసున్న ఆడశిశువు నెలలు నిండక ముందే పుట్టడంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. మరింత మెరుగైన సేవల కొరకు హైదరాబాదు లోని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి అధ్వాన్నమైన సేవలు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వేలాడే విద్యుత్ వైర్ల వలన షాకుకు గురై ఆ పసికందు మరణించింది.
[మార్చు] జనవరి 1 2006, ఆదివారం