పెరుగు శివారెడ్డి
వికీపీడియా నుండి
డాక్టర్ పెరుగు శివారెడ్డి (సెప్టెంబర్ 12,1920 - సెప్టెంబర్ 6,2005) ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. శివారెడ్డి, కర్నూలు జిల్లా కర్నూలు మండలము దిన్నెదేవరపాడు గ్రామంలో జన్మించాడు.
ఆయన 1946లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. (డాక్టరు) పట్టాని పొంది 1952లో నేత్రవైద్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు. ప్రాక్టీసు మొదలు పెట్టిన తరువాత ఆయన హైదరాబాదులోని ఉస్మానియా వైద్య కళాశాలలో చేరారు. గుండెపోటుతో మరణించే వరకు ఆయన హైదరాబాదులోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి కి డైరెక్టరుగా ఉన్నారు.
ఆయన 1964 లో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిదైన టి. ఎల్. కపాడియా ఐ బ్యాంకు ను వ్యాపారవేత్త టి.ఎల్.కపాడియా యొక్క ఆర్ధిక సహాయముతో హైదరాబాదులో నెలకొల్పారు. ఆయన అంతర్జాతీయ సమావేశాలలో రెండొందల పేపర్లకు పైగా సమర్పించారు. పేదవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి తోడ్పడే ఉద్దేశ్యంతో ఆయన ఐదొందలకు పైగా నేత్ర శిబిరాలను నిర్వహించారు. తన నిపుణత వలన కంటి శుక్లాల ఆపరేషనులలో దిట్టగా ఆయన పేరు పొందారు; రెండు లక్షల యాభై వేలకు పైగా కంటి శుక్లాల ఆపరేషనులు చేసి అత్యధిక కంటి శుక్లాల ఆపరేషనులు చేసిన డాక్టరుగా గిన్నిస్ రికార్డులకెక్కారు. భారత ప్రభుత్వం నుండి 1971 లో పద్మశ్రీ, 1977 లో పద్మభూషణ్ పురస్కారాలను పొందారు. ఈయన విశాఖపట్నం, వరంగల్ మరియు కర్నూలులలో ప్రాంతీయ నేత్ర వైద్యశాలల యేర్పాటుకు చాల కృషి చేశారు. 1990లో కర్నూలులో స్థాపించబడిన ప్రభుత్వ నేత్ర వైద్యశాల ఆయన పేరున స్థాపింపబడినది. ప్రఖ్యాత తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి తన పేరున స్థాపించిన చిరంజీవి నేత్ర వైద్యశాల కొరకు శివారెడ్డి గారి సలహాలను కోరి, ఆయన సూచనలను పాటించారు.
[మార్చు] ఆధారం
- సెప్టెంబర్ 7,2005 నాటి ఈనాడు లో ప్రచురితమైన వార్తాకథనం ఆధారంగా.