తాళ్ళపాక

వికీపీడియా నుండి

కడప - రాజంపేట రహదారిలో రాజంపేటకు సమీపంలో ప్రధాన రహదారి నుండి తూర్పుగా 3 కి.మీ. దూరంలో తాళ్ళపాక గ్రామముంది. కలియుగ దైవమైన వేంకటేశ్వరుని 32 వేల కీర్తనలతో ఆరాధించిన అన్నమాచార్యుడు తాళ్లపాకలో జన్మించాడు. "చందమామ రావే జాబిల్లి రావే", "అదివో అల్లదివో శ్రీహరివాసము" వంటి పాటలు ఆయన నుండి తెలుగు వారికి దక్కాయి.

క్రీ.శ. 1426వ సంవత్సరం క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున తాళ్లపాకలో అన్నమయ్య జన్మించాడు. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమయ్య చిన్నప్పుడే తిరుమల చేరుకున్నాడు. తల్లిదండ్రులు కోరగా తిరిగి తాళ్ళపాకకు వచ్చి వివాహం చేసుకున్నా తిరిగి తిరుమలకు వెళ్ళాడు. ఆయన ఇల్లాలు తిమ్మక్క సుభద్రాపరిణయం రచించింది. తెలుగులో ఆమే తొలి కవయిత్రి. అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యులు కూడా కీర్తనలు రచించాడు.

తాళ్ళపాకలో చెన్నకేశవాలయం, సుదర్శనాలయం ఉన్నాయి. సుదర్శనాలయంలో సుదర్శన చక్రం ప్రతిష్ఠించబడి ఉంది. సుదర్శన చక్రం కాశీలో తప్ప మరెక్కడా లేదు. తాళ్ళపాకలో సిద్ధేశ్వరాలయం కూడా ఉంది. ఈ ఆలయాలు 9, 10 శతాబ్దాల నాటివి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1982లో అన్నమయ్య ఆరాధన మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పారు.