సెయింట్ మేరీ కేథడ్రాల్

వికీపీడియా నుండి

కడప పట్టణంలోని మరియాపురంలో కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి మీద సెయింట్ మేరీ కెథడ్రల్ చర్చి ఉంది. ఈ చర్చి ఆధునిక నిర్మాణం. ఆంధ్ర దేశంలో ఇటువంటిది మరెక్కడా లేదు. 1992 ఫిబ్రవరి 19 వ తేదీన ఆ చర్చిని ప్రారంభించారు. ఆ నాటికి నిర్మాణానికి అయిన ఖర్చు కోటి రూపాయలు. చర్చి పైభాగంలో గుమ్మటం ప్రకాశిస్తూ ఉంటుంది. చావు పుట్టుకల బంధంలో చిక్కుకొని దిక్కు తెలియని వారికి కాంతిరేఖ ఈ గుమ్మటం. ఈ గుమ్మటం వెలుగుల్ని రాత్రిపూట చూడాలి. నైతిక విలువలతో ధర్మ మార్గంలో మానవులు పయనించడానికి ఇది చక్కని సంకేతం.

తెల్లని పాలరాతితోను, ఆకుపచ్చ రాతితోను ఈ మందిరాన్ని నిర్మించారు. సువిశాల మైదానంలో అందమైన ఈ మందిరం చూచేవారికి కనువిందు చేస్తుంది. ప్రతిరోజూ ప్రార్థనలతో ఈ క్రైస్తవ మందిరం ప్రశాంతి కేంద్రంగా ఉంటుంది. ఆరోగ్యమాత వేడుకలు, క్రిస్మస్ వేడుకలు ఆనంద పారవశ్యాలతో సాగుతాయి. హిందూ, క్రైస్తవ వాస్తుశిల్ప నిపుణులచే ఈ మందిరం నిర్మించబడింది.