వనపర్తి సంస్థానము

వికీపీడియా నుండి

వనపర్తి సంస్థానము హైదరాబాదు రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాలో నైఋతి దిక్కున ఉన్నది. ఈ సంస్థానములోని 124 గ్రామాలు మహబూబ్ నగర్ జిల్లా యొక్క నాగర్‌కర్నూల్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కల్వకుర్తి మరియు అమ్రాబాద్ తాలూకాలలో విస్తరించి ఉన్నాయి. ఈ సంస్థానము 450 చ.కి.మీ.లలో విస్తరించినది. 1901లో సంస్థాన జనాభా 62,197. సంస్థానము యొక్క రెవిన్యూ 1.5 లక్షలు, అందులో 76,883 రూపాయలు నిజాముకు కప్పముగా కట్టేవారు

[మార్చు] చరిత్ర

ఈ సంస్థానపు రాజులు కుతుబ్ షాహీ రాజులకు సన్నహితముగా ఉండేవారు. తొలిదశలోని వనపర్తి రాజులు 2000 మంది పదాతి దళము మరియు 2000 మంది అశ్విక దళాలు కల సైన్యమును నిర్వహించేవారు. 1727 వరకు సంస్థానానికి సుగూరు రాజధానిగా ఉండేది. దాని పేరు మీదుగా సంస్థానాన్ని సుగూరు సంస్థానము అని పిలిచేవారు. కానీ తర్వాతి కాలములో వనపర్తిని రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. పరిపాలనా సౌలభ్యము కొరకు సంస్థానమును "సుగూరు" మరియు "కేశంపేట్‌‌" అను రెండు తాలూకాలుగా విభజించి, ఇద్దరు తహసీల్దారులను నియమించారు.

1843 మార్చి 17న నిజాము సికందర్‌ ఝా, రాజా రామేశ్వర రావు I కు గౌరవ చిహ్నముగా "బల్వంత్" అను బిరుదును ప్రధానము చేశారు.

నిజాము తన సైన్యముకు రాజా రామేశ్వర రావు I ను ఇన్స్పెక్టర్‌గా నియమించాడు. రాజా రామేశ్వర రావు I, హైదరాబాదీ బెటాలియన్‌ 1853 నవంబర్ 5 న సృష్టించెను. 1866లో రాజు యొక్క మరణము తర్వాత, ఈ బెటాలియన్‌ నిజాం సైన్యములో కలపబడి దానియొక్క ప్రధాన బిందువయ్యెను. ఈయన తర్వాత ఇతని కుమారుడు రాజా కృష్ణ ప్రసాద రావు సంస్థానాధీశుడయ్యెను.

1910లో రాజా రామేశ్వర రావు II, ముఖ్యముగా అబిస్సీనియులు, సొమాలీలు మరియు ఐరోపా అధికారులతో కూడుకొన్న అశ్విక దళము ఆఫ్రికన్‌ క్యావలరీ గార్డ్స్‌ లేదా ఏ.సీ.గార్డ్స్‌, నిజామ్‌ VI కి బహుకరించెను. ఈ ప్రత్యేక దళమును అధికారిక సందర్భములలో నిజామ్‌ యొక్క భద్రత కొరకు ఉపయొగించేవారు.

"మహారాజ" రాజా రామేశ్వర రావు II, 1922 నవంబర్ 22వ తేదీన మరణించారు. అతనికి ఇద్దరు కుమారులు, కృష్ణదేవ రావు మరియు రామదేవ రావు. భారత దేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తర్వాత ఈ కుటుంబము దేశ రాజకీయాలలో కూడా పాల్గొన్నది.

[మార్చు] విశేషాలు

ఈ సంస్థానము యొక్క నైరుతీ భాగము గుండా కృష్ణా నది 16 మైళ్ల దూరము ప్రవహించేది. కానీ, నదీతలము చాలా అడుగున ఉండటము మూలాన దాని జలాలు వ్యవసాయపారుదల కొరకు ఉపయోగపడటము లేదు. వనపర్తి పట్టణములో ఆ రోజుల్లో ఆముదము తయారుచేయుటకు ఒక నూనె మిల్లు ఉండేది. ఇక్కడి తయారు చేసిన ఆముదము రాయచూరు మరియు మద్రాసు ప్రెసిడెన్సీలోని కర్నూలుకు ఎగుమతి చేసేవారు. నూలు మరియు పట్టు వస్త్రాలు, చీరలు ఇక్కడ నేసేవారు కానీ, వాటి అల్లిక అమరచింత మరియు గద్వాలలో నేసిన వాటంత నాణ్యముగా లేదు.