తోలుబొమ్మలాట

వికీపీడియా నుండి

 తోలుబొమ్మలు
పెద్దది చెయ్యి
తోలుబొమ్మలు

తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం.

విషయ సూచిక

[మార్చు] తోలుబొమ్మలు - ఆవిర్భావం

తోలుబొమ్మల పుట్టుకమీద అనేక కట్టుకధలు ఉన్నాయి. పూర్వం రాజ్యాలను పాలించే ఒక రాజు ఆస్థానంలోని పండితులు తమ ప్రభువును సంతోషపెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపచేస్తే సృజనాత్మకంగా ఉంటుందని తోలుబొమ్మలను తయారుచేసి తెల్లటి పంచెను తెరగా అమర్చి దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శించారట. ఈ ఆటలు నిజంగా పండితుల చేతనే మెరుగులు దిద్దుకున్నదని చెప్పడానికి అమరకోశంలోని శ్లోకాలు నిదర్శనంగా పేర్కొనవచ్చు.

ఈ తోలుబొమ్మలు ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీముని పట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడ్రేవు, [[కొత్తపట్నం|కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్ళాయి. ఈ కళకు ఇతర దేశాల్లో బహుళ ఆదరణ లభించిందని చెప్పడానికి అక్కడ జరిగే ఉత్సవాలలో తోలుబొమ్మలను ప్రద్ర్శించడం బట్టి ఈవిషయం తెలుస్తున్నది. అదేవిధంగా అక్కడి నుండి పర్షియా, టర్కీల మీదుగా గ్రీకు దేశంలో ప్రవేశించి గ్రీకులో నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికాలోని ముస్లిందేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీకి, అక్కడినుండి ఫ్రాన్స్, వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్ కు వ్యాపించాయని చెప్పవచ్చు. ఈ తోలుబొమ్మలు కాలానుగుణంగా ఆయదేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ, భారతదేశం వీటికి మాతృక అని చెప్పవచ్చు.

[మార్చు] తోలుబొమ్మలు తయారీ

ఇంతటి గొప్పచరిత్ర కలిగిన తోలుబొమ్మలు తయారీ కష్టంతో కూడుకున్నది. వీటి తయారీకి జింక, దుప్పి, మేక తోళ్ళను వాడతారు. చైనా లో గాడిద చర్మంతోను, గ్రీకుదేశంలో ఒంటె చర్మంతోను తోలుబొమ్మలను తయారు చేస్తారు. పచ్చితోళ్ళను పరిమితమైన వేడిలో నానబెట్టి బండమీద లేదా చదునైన చాపమీద పరచి తోలుపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తారు. ఆ తర్వాత చర్మానికి మిగిలి ఉన్న పల్చటి చర్మపుపొరను పదునైన కత్తి సహయంతో తీసివేసి మరోసారి వేడినీటిలో వేసి ఉప్పుతో శుభ్రపరుస్తారు. శుభ్రపరిచిన తోలును మేకుల సహయంతో చతురస్రాకారపు చెక్కకు బిగించి ఆరవేస్తారి. ఈవిధంగా చేయడం వల్ల ఏకోద్దిపాటి నలకలున్నా అవన్నీపోతాయి. ఇన్ని దశల్లో శుభ్రపరచిన తోలు పలచనిపొరగా, పారదర్శకంగా తయారై దీపపుకాంతి ప్రసరించే విధంగా అవుతుంది. జింక , దుప్పిచర్మాలను దేవతల పాత్రలకు, మేక చర్మాలను దుష్టపాత్రలకు, హస్యపాత్రలకు ఉపయోగిస్తారు. ఎంపికచేసుకున్న బొమ్మలకు రేఖాచిత్రాల ఆధరంగా ప్రకృతిసిద్దమైన కరక్కాయ, చింతగింజలపొడి, అన్నభేది మొదలైన రంగులచే తోలుబొమ్మలకు ఇరువైపుల రంగులు వేస్తారు. ప్రస్తుతం ఆధునికులు పారదర్శకమైన రంగులను ఉపయోగిస్త్తున్నారు.

రంగులతో సిద్దమైన తోలుబొమ్మలు తల, మొండెము కలసి ఒక భాగంగాను, చేయిని మూడు భాగాలుగాను, కాలును రెండు భాగాలుగాను తీర్చిదిద్ది అన్నింటిని ఒక దగ్గరకు చేర్చి సూత్రం (దారం) ద్వారా కలుపుతారు. అదేవిధంగా ఈ బొమ్మలను ఆడించడానికి వీలుగా బొమ్మకు నిలువుగా ఒక ఈతబద్దను పైనుంద్డి క్రింద వరకు అమర్చి రెండుకాళ్ళ మధ్యభాగంలో పిడికెడు బద్దను వదులుతారు. ఈవిధంగా వదిలిన బద్దను పట్టుకుని ఆడిస్తారు.

[మార్చు] తోలుబొమ్మల ప్రదర్శన

 తోలుబొమ్మల ప్రదర్శన
పెద్దది చెయ్యి
తోలుబొమ్మల ప్రదర్శన

రంగస్థలంపై పొడవాటి గుంజలపై తెల్లటి వస్త్రాన్ని లేదా పంచెను ముందు భాగంలో గట్టిగా లాగి కడతారు. తెర భూమి బుండి నిలువుగా ఉండకుండా కొంచెం ఏటవాలుగా కడతారు. ఈ విధంగా కట్టడం వల్ల బొమ్మలను ఆడించేటప్పుడు బొమ్మలకాళ్ళు అడ్డుతగలకుండా వుంటుంది. తోలుబొమ్మల ప్రతిబింబాలు సరిగ్గా తెరపై పడడానికి తెరలోపలి నుండి పూర్వం కాగడాలు ఉపయోగించేవారు. అయితే విద్యుత్ సౌకర్యం అభివృద్ది చెందిన తర్వాత ఎక్కువ కాంతిని ఇచ్చే విద్యుత్ బల్బులను వాడుతున్నారు.

ప్రదర్శన సంబంధమైన కదలికలకు అనుగుణంగా ప్రధాన గాయకుడు పాడుతూ వుంటే, మిగిలినవారు వంతలుగా పునఃరుచ్చరిస్తారు. వంతల్లో స్త్రీలు ప్రధానంగా ఉంటారు. రాగంతీయడం, ముక్తాయింపు, సంభాషణ ధోరణిలో స్త్రీగొంతు ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇందులో స్త్రీ పాత్రలకు స్త్రీలే పాడతారు.

[మార్చు] తోలుబొమ్మలాటలో పాత్రలు

తోలుబొమ్మలాట అంటే చాలు కేతిగాడు, బంగారక్క, జుట్తు పోలిగాడు వంటి హస్యపాత్రలు ప్రధానంగా వస్తాయి. ఈ పాత్రలు గ్రామీణుల మనస్సులపై విశేషాదరణ చూపాయి. తోలుబొమ్మలాటలో ప్రధానకథకు ఎంత ప్రాముఖ్యతవుండేదో, ఈ హస్యపాత్రలకు అంతే ప్రాధాన్యత ఉండేది. ఈ పాత్రలు సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలుస్తాయి. ఈ పాత్రల ద్వారా సమాజంలో ఉండే దురాచారాలను, మూఢనమ్మకాలను ఎండగట్టేవారు. ఇందులో సామెతలు, లోకోక్తులు, పొడుపులు, నీతికథలు మొదలైనవి చోటు చేసుకుంటాయి. అదేవిధంగా అభినయాలకు స్వభావానుగుణంగా తేల్చడానికి వాద్యాలు కూడా ప్రధాన భూమికను నిర్వహిస్తాయి. వాద్యానికి సంబంధించి హర్మోనియం, తాళాలు, తొక్కుడుబిల్ల, మద్దెల, డప్పు, గజ్జెలు వంటివి ఉంటాయి. తోలుబొమ్మల ప్రదర్శనలో రామాయణం, భారతంలకు సంబంధించిన కథా వస్తువులు ఉంటాయి. లంకా దహనం, సతీసులోచన, యయాతి, అంగద రాయభారం, మైరావణవధ, విరాటపర్వం, పద్యవ్యూహం, ఉత్తరగోగ్రహణం వంటి కథలతో తోలు బొమ్మలను ప్రదర్శిస్తారు.

తోలుబొమ్మలాటలకు ఉథృతంగా ఆదరణ లభిస్తున్న రోజుల్లో ఈ ప్రదర్శన జరుగుతునందంటే ఆ గ్రామంలో పండిత పామరులు కులమత భేదభావాలు మరచి తిలకించేవారు. తమకిష్టమైన పురాణ పురుషుల కథలను తెలుసుకునేందుకు ఈ తోలుబొమ్మలు తప్ప, మరోసాధనం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇంకా చరిత్రను పరిశీలించి చూస్తే నాగరికత వికసిస్తున్న తొలి రోజుల్లో మానవుడు తన మనుగడ కోసమే ఎక్కువ కాలాన్ని వెచ్చించిన తొలినాళ్ళలో ఈ జానపద కళారూపం అవిర్భవించడంతో అతనికి మనోరంజనం కలగడమేకాక, తాను విన్న పురాణ కథల్లోని పాత్రలు కళ్ళముందు సాక్షాత్కరించడంతో భక్తి పారవశ్యంతో ఆనందానుభూతులకు లోనయ్యేవాడు. అంతేకాక పాత్రల స్వరూప స్వభావాలను ఆకళింపు చేసుకుని, తన జీవన సరళిలో నీతినియమాల పాటింపుతో కొంత నాగరికతను పెంపొందించుకున్నడు. ఒకరకంగా తాము కొలిచే దేవుడికి ఒక సమగ్రమైన రూపాన్ని తోలుబొమ్మలాటతోనే గుర్తించ్గలిగి, ఆరాధించడం మొదలు పెట్టాడని చెప్పవచ్చు.

వార్తాపత్రికలు , రేడియో వంటి సమాచార వ్యవస్థలేని తొలిరోజుల్లో తోలుబొమ్మలాట సమాచార మాథ్యమంగా పనిచేసిందని చెప్పవచ్చు. గ్రామ చంచారంగా సాగే ఈప్రక్రియ ఒక గ్రామంలోని సమాచారాన్ని మరో గ్రామానికి చేరవేయడం, ఆరోగ్యవిషయాలు, నీతి నియమాలు రాజకీయ మార్పులు, దొంగవ్యాపారుల గుట్టు మొదలైన ఆనాటి స్థితిగతులను బొమ్మలతో గృశ్యరూపంగా అందించి సమాచార వారధిగా నిలిచింది ఈకళాప్రక్రియ. ఆంధ్రదేశంలోని హిందూపురం, బొమ్మలాటపల్లి, అనంతపురం, ధర్మవరం, చెరుకుపల్లి, మదిరి, బసవయ్యపాలెం, గుండాలమ్మ పల్లె, వాడపల్లి, నెల్లూరు, వంటి అతికొద్ది ప్రాంతాల్లో తోలుబొమ్మల బృందాలు చివరి దశలో జీవిస్తున్నాయి.

[మార్చు] మనుగడ

ఇంతటి ఉన్నత ప్రమాణాలతో నిండిన తోలుబొమ్మలాట వంశపారం పర్యంగా వస్తున్న ఒక కళాసంస్కృతి. వేల సంవత్సరాలుగా నోటివిద్య (మౌఖికం)గా వస్తూ జానపదుల గుండెల్లో గూడుకట్టుకున్న ఉత్కృష్టమైన కళాప్రక్రియ. రామాయణ, మహాభారత, భాగవత కథను అలవోకగా చెప్పే తోలుబొమ్మల కళాకారుల మాతృభాష ' మరాఠీ అంటే ఆశ్చర్యం కలిగించక మానదు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఈ కళారూపం ఆంధ్రదేశంలో ఒక ప్రముఖ కళా రూపంగా అభివృద్దిచెంది తెలుగు సంస్కృతిలో మిళితమై మన జాతీయ సంపదకే వన్నె తెచ్చింది. ఇంతటి ఉన్నతమైన ఈ కళాప్రక్రియ నేడు అతి కొద్ది బృందాలతో జీవిస్తోంది. తోలుబొమ్మల దీపపుకాంతులు చరమాంకంలో ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ కళకు సంబందించిన రచనలు, చరిత్ర, తోలుబొమ్మల తయారీ, బొమ్మలనాడించే పద్ధతులు, ఇందులో ఇమిడివున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం 'లిపి ' ద్వారా లేకపోవడం దురదృష్టకరం. మిగతా రాష్ట్రాల్లో పాశ్చాత్య దేశాల్లో ఉన్న బొమ్మల్లాట ప్రక్రియకు సంబంధించిన విజ్ఞానం లభ్యమవడం కారణంగా ఔత్సాహికులు, బృందాలు బొమ్మలాటల మనుగడకు, వ్యాప్తికి విశేష కృషి చేస్తుండగా, తోలుబొమ్మల కృషికి మనం మార్గం వేయలేకపోతున్నాము.

తోలుబొమ్మల కళారూపం అంతరించిపోవడానికి గల కారణం పరిశీలిస్తే 19, 20వ శతాబ్దాలలో నాటకాల ప్రభావం ఉధృతంగా ఉండడం, పద్యనాటకాల ప్రధాన్యత పెరగడం, నాటకాల్లో , శాస్త్రీయతకు, సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్నతస్థానం లభించడం, అంతకంటే ముఖ్యంగా లూమియర్ బ్రదర్స్ సాంకేతిక సృష్టిలో ఆవిష్కరించిన సినిమాలు ప్రజలను సమ్మోహితులను చేయడం, తెరపై ప్రేక్షకులకు కావలసినవి అందించడం, అదేవిధంగా ఇంట్లోనే జనరంజకం అన్న నేపథ్యంలో విస్తృతంగా చానల్స్ వచ్చి ప్రపంచ తీరుతెన్నులను మార్చడం వంటి ఎన్నో కారణాలు తోలుబొమ్మలు లాంటి కళారూపాల మనుగడకు సవాలుగా నిలిచాయి. ఇలాంటి విషమపరిస్థితుల్లో, ఇవీ మన ఆనవాళ్ళు అని చెప్పడానికి మన కళారూపాలను బ్రతికించు కోవలసిన అవసరం ఏర్పడింది. తోలుబొమ్మలాట వంటి కళారూపానికి మరిన్ని మెళకువల్ని జోడీంచి, దీన్ని ఆధునిక మానవుడికి చేరువగా తీసుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్మప్రచారం రజకీయరంగం, పిల్లలవిద్య, మానసిక వికలాంగుల విద్య, వైద్య పరిజ్ఞాన ప్రచారం వంటి మొదలైన రంగాల్లో ఈ కళారూపాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ కళా రూపాల మనుగడకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే కాకుండా విశ్వవిద్యాలయాలు, స్వచ్చంద సంస్థలు, పరిశోధకులు తమవంతు కృషిని అందజేస్తే మన భావితరాలవారికి ' ఇవీ మన ఆనవాళ్ళు ' అని సగర్వంగా అందించవచ్చు.

[మార్చు] వనరులు

  • 2003 నవంబర్ ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక లో జె.విజయకుమార్ వ్యాసం: తెలుగుజాతి అందాలతోట - తోలుబొమ్మలాట నుంచి.