ఈనాడు
వికీపీడియా నుండి
తెలుగు పత్రికా చరిత్రలో ఈనాడుది ఒకప్రత్యేక అధ్యాయం. వార్తలను సమర్పించడంలో కొత్తపుంతలు తొక్కి అశేష ప్రజల ఆదరాభిమానాలు పొందింది. తెలుగు పత్రికలలోనే కాక యావద్దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికలలో ఒకటిగా నిలిచింది. ప్రజల జీవితాలతో మమేకమై, సమకాలీన చరిత్రలో విడదీయరాని భాగమైపోయింది. ఈనాడు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రిక. NRS 2005 సర్వే ప్రకారం 1,13,49,000 మంది పాఠకులను కలిగి, దేశంలోనే తృతీయ స్థానంలో నిలచినది.
విషయ సూచిక |
[మార్చు] ప్రారంభం
1974 ఆగష్టు 10 న రామోజీరావు అనే యువకుడు విశాఖపట్నం లో, సీతమ్మధార లోని నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడు ను ప్రారంభించాడు. చాలా సాధారణంగా, ఏ ఆర్భాటాలు లేకుండా 5000 ప్రతులతో ఈనాడు ప్రయాణం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి.
అప్పట్లో ఉన్న పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది.
ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు.
అలాగే తెలుగు పత్రికల పేర్లు -ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, మొదలైనవి - తెలుగు భాషకు సహజమైన చక్కటి గుండ్రటి అక్షరాలతో అచ్చయ్యేవి. అయితే ఈనాడు ఈ సాంప్రదాయాన్ని పక్కనపెట్టి, తన పేరును పలకల అక్షరాలతో ముద్రించింది. ఇది కూడా పాఠకులకు కొత్తగా అనిపించింది.
విశాఖపట్నంలో ప్రముఖ దినపత్రికలేవీ అచ్చవని ఆ రోజుల్లో ఈనాడు స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ రావడంతో ప్రజలకు మరింత చేరువయింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలకు అది ఇస్తూ వస్తున్న ప్రాధాన్యత ఒక కారణం.
[మార్చు] ప్రస్థానం
ప్రముఖ పాత్రికేయుడైన ఎ బి కె ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుదు. ఆయన నిర్వహణలోను, ఆ తరువాత కూడా, ఈనాడు బాగా అభివృద్ధి సాధించింది. 1975 డిసెంబర్ 17 న హైదరాబాదు లో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి, రాష్ట్రంలోను, రాష్ట్రం బయటా మొత్తం 23 కేంద్రాలనుండి ప్రచురితమౌతూ, అత్యధిక ప్రచురణ, ఆదరణ కల భారతీయ భాషా పత్రికలలో మూడవ స్థానానికి చేరింది.
సమర్ధులైన సంపాదక సిబ్బంది, పటిష్టమైన సమాచార సేకరణ వ్యవస్థ, ఆధునిక సాంకేతిక అభివృద్ధిని సమర్ధంగా వాడుకోవడం మొదలైనవి ఈనాడు అభివృద్ధికి ముఖ్యమైన తెరవెనుక కారణాలు కాగా, స్థానిక వార్తలకు ప్రాధాన్యతనివ్వడం, క్రమం తప్పకుండా ప్రతిరోజు కనిపించే కార్టూన్లు, పేజీలో వార్తల అమరిక, మొదలైనవి పాఠకులకు కనిపించే కారణాలు.
పరిశోధనాత్మక వార్తలకు ఈనాడు పేరెన్నికగన్నది. 1978, 1983 మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనలతో అలజడి సృష్టించింది, ఈనాడు. సిమెంటు కుంభకోణం, టిటిడి లో మిరాశీదార్ల అక్రమాలు, భూకబ్జాలు మొదలైన వాటినెన్నిటినో వెలుగులోకి తెచ్చింది ఈనాడు. 1983 లో తెలుగుదేశం పార్టీ అధినేత రామారావు అధికారంలోకి రావడంలో ఈనాడు ప్రముఖపాత్ర పోషించింది. రామారావు పర్యటనలకు, ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించింది. 1993, 1994 లలో జరిగిన మద్యనిషేధ ఉద్యమంలో మహిళల పక్షాన నిలిచి పోరాటం చేసింది. ఆ సమయంలో ఉద్యమం కొరకు ఒక పేజిని ప్రత్యేకించింది, ఈనాడు. గుజరాత్ భూకంపం, హిందూ మహాసముద్ర సునామి వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఈనాడు తన వంతుగా సహాయం చేసింది.
[మార్చు] భాష
భాష విషయంలో ఈనాడు తెలుగు పత్రికలలో ఒక ఒరవడి సృష్టింది. సాధారణంగా ఇంగ్లీషులో అందుకునే వార్తలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తారు. అయితే సమయం తక్కువగా ఉండటం చేత గాని, ఒక పద్ధతికి అలవాటు పడటం వలన గానీ మిగిలిన పత్రికలలో భాష క్లిష్టమైన పదాలతో కూడి, సరళంగా ఉండేది కాదు. ఈనాడు, అనువాదాన్ని సరళతరం చేసి, సహజమైన, సులభమైన భాషలో వార్తలను అందించింది.
తెలుగు భాష కొరకు ఆదివారం పుస్తకంలో ప్రత్యేక శిర్షికలను ఈనాడు అందిస్తూ ఉంది. మామూలుగా దినపత్రికలు అందించే కథలు, కథానికలే కాక, భాష విస్తృతికి దోహదం చేసే శీర్షికలను ప్రచురించింది. వాటిలో కొన్ని: తెలుగులో తెలుగెంత, మాటల మూటలు, తెలుగు జాతీయాలు, మాటల వాడుక, మాటలు, మార్పులు మొదలైనవి.
[మార్చు] విశిష్టతలు
[మార్చు] పరిశోధనా విభాగం
ఈనాడుకు ఒక స్వంత పరిశోధనా విభాగం (రీసెర్చి అండ్ రిఫరెన్స్ గ్రూప్) ఉంది. ఇది ఈనాడుకు సమాచార నిధి వంటిది. దేశ విదేశాలనుండి ఎన్నో పత్రికలు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలు, వార్తల విశ్లేషణకు, వివరణకు అవసరమైన సమాచారం ఇక్కడి నుండే వస్తుంది.
[మార్చు] ఆదివారం పుస్తకం
ఆదివారం ప్రత్యేక అనుబంధాన్ని పుస్తకం రూపంలో అందించే సాంప్రదాయాన్ని తెలుగులో మొదలు పెట్టింది ఈనాడే. 1988 ఫిబ్రవరి 28 నాడు ఇది మొదలైంది. సరదా పఠనం ఈ పుస్తకం లోని శీర్షికల ముఖ్య ఉద్దేశ్యం.
[మార్చు] జిల్లా ఎడిషన్లు (మినీ ఎడిషన్లు)
ఫ్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అనుబంధాన్ని ప్రారంభించి, తెలుగు పత్రికా రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించింది ఈనాడు. 1989 జనవరి 26 న ప్రారంభమైన ఈ జిల్లా అనుబంధాలతో వార్తల సమర్పణలో ఒక కొత్త శకం మొదలైంది. తన రాష్ట్రం, తన జిల్లా వార్తల వరకే పరిమితమైన తెలుగు పాఠకుడు తన గ్రామంలో జరిగిన వార్తలను కూడా పత్రికలలో చదవడం మొదలు పెట్టాడు. ఈ సాంప్రదాయాన్ని మిగిలిన పత్రికలూ అనుసరించాయి.
[మార్చు] వసుంధర
స్త్రీలకు ప్రత్యేకించిన ఈ అనుబంధంలో సినిమా వార్తలకు ఒక పేజీని కేటాయించారు. బహుళ ప్రచారం పొందిన ఈ అనుబంధంలో ప్రముఖ మహిళల గురించే కాక, రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాలలోని వార్తలకెక్కని గొప్ప స్త్రీల గురించిన విశేషాలు కూడా ప్రచురిస్తారు.
[మార్చు] ఈనాడులో లేనివి
తెలుగు పత్రికలలో అగ్రగామిగా ఉన్న ఈనాడులో కొన్ని శీర్షికలు లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. వాటిలో కొన్ని:
- రాశి ఫలాలు: ఏ భాషలోనైనా దాదాపు ప్రతీ పత్రికలోను తప్పనిసరిగా ఉండే ఈ శీర్షికకు ఈనాడులో చోటు లేదు.
- డైలీ సీరియళ్ళు: దిన పత్రికలలో డైలీ సీరియల్ ఒకటి ఉండటం తెలుగు పత్రికలలో రివాజు. కానీ ఈనాడు ఈ శీర్షికను ఎప్పుడూ ప్రవేశపెట్టలేదు. అయితే ఆదివారం అనుబంధంలో మాత్రం ఒక కథను ప్రచురిస్తారు.
[మార్చు] ప్రముఖులు, శీర్షికలు
ఈనాడుకు ఎంతోమంది ప్రముఖులు ఖ్యాతి తీసుకువచ్చారు. అలగే ఎంతో మంది ఈనాడు ద్వారా ఖ్యాతి పొందారు. వారిలో కొందరు:
- ఎ.బి.కె.ప్రసాద్: ఈనాడుకు ప్రథమ సంపాదకుడు. తొలినాళ్ళలో పత్రిక అభివృద్ధికి దోహదపడ్డాడు.
- శ్రీధర్: ప్రముఖ కార్టూనిస్టు. ఈనాడు బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో సహాయపడ్డాయి. ఆయన కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి.
- గజ్జెల మల్లారెడ్డి: పుణ్యభూమి శీర్షికతో పత్రికకు ఎందరో అభిమానుల్ని సంపాదించి పెట్టాడు.
- బూదరాజు రాధాకృష్ణ: పుణ్యభూమి శీర్షికను సి.ధర్మారావు అనే కలం పేరుతో కొనసాగించాడు. ప్రతి ఆదివారం మాటలూ మార్పులూ అనే పేరుతో తెలుగు మాటల తప్పొప్పుల గురించిన శీర్షికను నిర్వహించాడు.
- చలసాని ప్రసాదరావు: ఈయన కబుర్లు శీర్షిక ఎంతో విజయవంతమయింది.
- డి.వి.నరసరాజు: అక్షింతలు అనే ఈయన శీర్షిక కూడా మంచి ఆదరణ పొందింది.
[మార్చు] మూలాలు
- ఈనాడు పత్రిక
- నామాల విశ్వేశ్వరరావు రాసిన తెలుగు జర్నలిజం చరిత్ర పుస్తకం.
- వివిధ ఇతర పుస్తకాలు