దేవుని కడప
వికీపీడియా నుండి
ఇక్కడ ఉన్న లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప గడప అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. కృపాపురమే కడపగా మారిందంటారు. క్రీ.శ. 2వ శతాబ్దంలో టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు. ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని రాశాడు. కరిపె అనే మాటే చివరికి కడపగా మారి ఉండవచ్చు.
ఈ గుడిలో ఒక మందిరంలో వేంకటేశ్వరుడు, ఆయనకు ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘ శుద్ధ పాడ్యమి నుండి సప్తమి(రథసప్తమి) వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు. తిరుమల వెళ్ళే యాత్రికులు మొదట ఈ దేవుని దర్శించడం ఆచారం. మహమ్మదీయులు కూడా ఈ స్వామిని దర్శించడానికి వస్తారు.
విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడిమాన్యాలు, బంగారు సొమ్ములు ఈ స్వామికి సమర్పించారు. తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ స్వామి మీద 12 కీర్తనలు చెప్పాడు. ఈ గుడిలో విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి చూడదగినవి. అమ్మవారి ఆలయం ముందున్న కప్పులో రాతి బల్లులు చిత్రించబడ్డాయి. పాపనివారణం కోసం ఈ బల్లుల్ని తాకుతారు. ఇక్కడ ఇటీవల నిర్మించిన అద్దాల మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ.
గర్భగుడి వెనుకవైపు ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహముంది. ఈ ఆంజనేయస్వామి ఈ క్షేత్రపాలకుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువునామాలుండడం విశేషం. దేవుని కడపలో ఇంకా సోమేశ్వరాలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణమటపముంది.
"కాదనకు నామాట కడపరాయా నీకు
గాదెవోసే వలపులు కడపరాయా
కలదాననే నీకు గడపరాయా వో
కలికి శ్రీ వేకటాద్రి కడపరాయ"
- -తాళ్ళపాక అన్నమాచార్యులు