మాయాబజార్
వికీపీడియా నుండి
- మాయాబజార్ పేరుతో ఇంకొన్ని వ్యాసములు ఉన్నాయి, వాటి కోసం మాయాబజార్ (అయోమయ నివృత్తి) చూడండి.
మాయాబజార్ (1957) | |
![]() |
|
---|---|
దర్శకత్వం | కె వి రెడ్డి |
నిర్మాణం | నాగి రెడ్డి & చక్రపాణి |
రచన | పింగళి నాగేంద్రరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు, ఎస్ వి రంగారావు , సావిత్రి , గుమ్మడి ,ఛాయాదేవి , సంధ్య , సి ఎస్ ఆర్ |
సంగీతం | ఘంటసాల |
విడుదల తేదీ | మార్చ్ 27 1957 |
నిడివి | 181 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అద్భుతం అనే మాటకు అసలైన నిర్వచనం గా నిలిచి పోయిన చిత్రం, మాయాబజార్. షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ మనకందించిన మరొక అపురూప కళాఖండం ఇది. భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, దొంగరాముడు మొదలగు చిత్రములను రూపొందించిన కె వి రెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకుడు. ఈ చిత్రము ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27వ తేదిన విడుదల అయ్యి అద్భుత విజయం సాధించింది.
విషయ సూచిక |
[మార్చు] కథా వస్తువు
ఇదే కథ తో 1937 సంవత్సరం లో శశిరేఖా పరిణయం పేరు తో ఒక చిత్రం రూపొందించబడింది. దానికి మాయాబజార్ అని మరొక పేరు. అదే పేరుని ఈ చిత్రానికి కూడా పెట్టడం జరిగింది. ఇక కథ విషయానికి వస్తే, మహాభారతం లో జరగని ఒక కల్పిత గాథ, ఈ చిత్ర కథావస్తువు.
దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడితో వివాహం నిశ్చయమైన శశిరేఖను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుడితో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవులను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలు.
[మార్చు] పాత్రలు, పాత్రధారులు
- కృష్ణుడు:ఎన్ టి ఆర్
- అభిమన్యుడు:ఏ ఎన్ ఆర్
- శశిరేఖ (బలరాముని కుమార్తె):సావిత్రి
- ఘటోత్కచుడు:ఎస్ వి రంగారావు
- లక్ష్మణ కుమారుడు:రేలంగి
- బలరాముడు:గుమ్మడి
- దుర్యోధనుడు:ముక్కామల
- శకుని: సి ఎస్ ఆర్
- రేవతీ దేవి (బలరాముని భార్య):ఛాయా దేవి
- సుభద్ర: ఋష్యేంద్రమణి
- రుక్మిణి: సంధ్య
- సాత్యకి: నాగభూషణం
- కర్ణుడు: మిక్కిలినేని
- దుశ్శాసనుడు: ఆర్ నాగేశ్వరరావు
[మార్చు] మాయాబజార్ ప్రశస్తి
సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే, ఈ చిత్రము ఒక మహాద్భుతమని చెప్పవచ్చు. మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు అజరామరంగా నిలుస్తాయి. ఈ చిత్రంలో పింగళి తస్మదీయులు, దుష్టచతుష్టయం , జియ్యా , రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం, వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తారు. రసపట్టులో తర్కానికి తావు లేదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు వంటి సంభాషణలు మనల్ని గిలిగింతలు పెట్టిస్తాయి.
మాటలు లేని చోటుల్లో కెమెరా మరింత అద్భుతంగా పని చేస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్ల గా ఆడుకుంటున్న శశిరేఖ ఉద్యానవనంలో ఒక కొలని గట్టున అలవోకగా కూర్చుంటుంది. కెమెరా ఆమె మొహమ్మీదనుంచి మెల్లగా పాన్ అయి కొలనులోని తామరమొగ్గను చూపిస్తుంది. గడచి పోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలు రేగడమూ, ఆ మొగ్గ మెల్లగా విచ్చుకోవడమూ, ఆ తర్వాత కెమెరా మెల్లగా వెనక్కి తిరిగి శశిరేఖ మొహాన్ని చూపడమూ జరుగుతాయి. ఇప్పుడక్కడ నవయవ్వనవతి యైన శశిరేఖ అంటే సావిత్రి ఉంటుంది!
ఈ చిత్రానికి మొదటగా సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకులుగా నియమితులయ్యారు. 4 యుగళగీతాలకు స్వర కల్పన చేసాక, కారణాంతరాల వలన ఆతడు తప్పుకోగా సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితుడయ్యాడు. రాజేశ్వరరావు కట్టిన బాణీలకు వాయిద్య సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేసారు ఘంటసాల. ఘంటసాల , పి లీల , పి సుశీల , మాధవపెద్ది సత్యం మొదలగు వారి నేపధ్య గానంలో వచ్చిన , నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళా, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునదీ, సుందరి నీవంటి, ఆహ నా పెళ్ళీ అంటా, వివాహభోజనంబు వంటి గీతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. చమత్కారమేమిటంటే ఈ పాటల పల్లవులు తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా వాడుకోబడ్డాయి. ఆలాగే లాహిరి లాహిరి లాహిరిలో అన్న ఒకే పాటకు ముగ్గురు నటులకు (ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ , గుమ్మడి) ఘంటసాల పాడటం ఒక ప్రత్యేక విశేషం.
ఇక స్క్రిప్టు మనల్ని తల తిప్పుకోనీయకుండా చేస్తే మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, హర్బన్స్ సింగ్ స్పెషల్ ఎఫెక్ట్లూ మనల్ని రెప్ప వాల్చనీయకుండా చేస్తాయి. ఈ చిత్రానిది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన స్క్రీన్ ప్లే అని గుమ్మడి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డాడు. "లాహిరి లాహిరి లాహిరిలో" పాటను చూసి 'తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు' అనుకున్న వారు ఆ పాటను మండుటెండలో తీశారని తెలుసుకుని తెల్లబోయారు. ఇక స్పెషల్ ఎఫెక్టులా లెక్కపెట్టలేనన్ని. మచ్చుకు కొన్ని:
- అభిమన్యుడి దగ్గరకు తొలిసారి వచ్చినప్పుడు ఘటోత్కచుడు కొండ మీద దూకగానే ఆ అదటుకు కొండకొమ్ము విరిగి పడడమూ,
- మాయామహల్లో కంబళి లా కనిపించే గింబళి తనంతట తనే చుట్టుకోవడం,
- తల్పం లాంటి గిల్పం గిరగిరా తిరిగి క్రిందపడదోయడం లాంటి విడ్డూరాలు,
- ఘటోత్కచుడి "వివాహభోజనం"బు షాట్లు
కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ షాట్లు ఎలా తీయగలిగారనేది తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
[మార్చు] పాత్రలు వాటి స్వభావాలు
- ఘటోత్కచుడు
- మొదటిసారి చూసినప్పుడు అభిమన్యుడెవరో తనకు తెలియకపోయినా "బాలకా! నీ మీద ఏలనో ఆయుధము ప్రయోగించడానికి చేతులు రావడము లేదు" అని అనురాగం ప్రకటిస్తాడు. రాక్షస విద్యార్థులు 'దుష్టచతుష్టయం' అనే మాటలో ఒత్తులు సరిగా పలకలేక విడివిడిగా 'దుసట చతుసటయం' అని పలుకుతూంటే ఆ తప్పుని సరిదిద్దక దుర్యోధనాదుల్ని గుర్తు చేసుకుని పళ్ళు కొరుకుతూ "వాళ్ళనలాగే విడివిడి చేసి పొడిపొడి చేసెయ్యాలి." అని సమర్థిస్తాడు.
- "వివాహభోజనంబు" పాటయ్యాక ఘటోత్కచుడు పెళ్ళివంటకాలన్నీ చూసి ఆత్రం పట్టలేక తొందరగా తినెయ్యాలని గద పక్కన పెట్టి వొళ్ళు పెంచి కూర్చుంటాడు. అన్నీ ఖాళీ చేశాక గద కోసం తడుముకుంటే అది చేతికందనంత చిన్నదిగా ఉంటుంది. ఆ సందర్భంలో ఆ రాక్షసుడు ముందు తికమక పడి, నిదానంగా విషయం అర్థమైనట్లు తలాడిస్తాడు. అలాగే చివరి ఘట్టంలో తన అనుచరులు కౌరవులను చావబాదుతున్నప్పడు "ఆహా! ఆర్తనాదములు శ్రవణానందముగానున్నవి" అని తన రాక్షస ప్రవృత్తిని ప్రకటిస్తాడు.
- రేవతి
- సాత్యకి రాజసూయ యాగం నుంచి తిరిగొచ్చి మయసభ గురించి వర్ణిస్తూంటే, రేవతి "వనాలూ, తటాకాలూ కూడా మణిమయాలేనా?" అని ఆశగా, ఆశ్చర్యంగా అడుగుతుంది. ప్రియదర్శినిలో ఆమెకు ప్రియమైన వస్తువులుగా మణులు, బంగారం కనిపిస్తాయి. అయితే, ఆ నెపాన్ని రుక్మిణి మీదకు నెట్టేస్తుంది: "ఏమో, నాపక్కన నువ్వున్నావు. నువ్వనుకున్నది కనిపించిందేమో?" అని. పాండవులు రాజ్యం కోల్పోగానే, వాళ్ళ సంబంధం వదులుకోవడానికి ఏ మాత్రమూ సంకోచించని దానిగా ఆమె ధనాశను, అవకాశవాద తత్వాన్ని ఇక్కడ ఈ రెండు మాటల్లోనే సూచించారు.
[మార్చు] మరిన్ని 'మాయ'లు
- అభిమన్యుడి పెళ్ళి చుట్టూ మూడు గంటల సేపు కథ నడిస్తే పాండవులెక్కడా కనిపించకపోయినా వాళ్ళేమయారనే అనుమానమెక్కడా ప్రేక్షకులకు రాలేదంటే అది దర్శకుడు పన్నిన మాయాజాలమే.
- "అహ నా పెళ్ళంట.." పాటలో తధోంధోంధోం తధీంధీంధీం అనే బిట్ ని పాడింది మాధవపెద్ది సత్యం కాదు. ఘంటసాల.
- "దురహంకార మదాంధులై.." అనే పద్యానికి ముందు వచ్చే "విన్నాను మాతా విన్నాను.." అనే సుదీర్ఘమైన డైలాగ్ ను పలికింది రంగారావు కాదు. మాధవపెద్ది సత్యం.
- ఆశ్చర్యం: ఈ సినిమాలో కర్ణుడికి అసలు కవచ కుండలాలే లేవు.
- ఈ చిత్రంలో ప్రముఖ నేపథ్య గాయకుడు మాధవపెద్ది సత్యం , భళి భళి భళి భళి దేవా గీతంలో రథసారథి పాత్రలో కనిపించి మనల్ని అలరిస్తారు.